- ఈనెల 25న సిద్దిపేటకు అమిత్ షా
- వచ్చే నెల ఫస్ట్ వీక్లో ప్రధాని మోదీ
- రెండు రోజుల కింద రాజ్నాథ్ పర్యటన
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి బీజేపీ నేతలు క్యూ కడుతున్నారు. రెండు రోజుల కింద రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించగా, ఈనెల 25న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. అభ్యర్థుల నామినేషన్లకు అగ్రనేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యేలా పార్టీ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నడ్డా, జనరల్ సెక్రటరీలు రాష్ట్రంలో పర్యటించారు. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు.
కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరీ కూడా నామినేషన్ల కార్యక్రమానికి అంటెండ్ అయ్యారు. కేంద్ర మంత్రులు జై శంకర్, అశ్వినీ వైష్ణవ్, ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, గుజరాత్ సీఎం భూపేంద్ర తదితరులు కూడా హాజరవుతారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే మెదక్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని సిద్దిపేటలో అమిత్ షా పర్యటించనున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించేలా బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలు పూర్తయిన రాష్ర్టాలకు చెందిన ముఖ్య నేతలను కూడా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అనుబంధ మోర్చాల నేతలు కూడా ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.