హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 నుంచి 40 సీట్లు గెలుస్తుందని ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా సెంటర్ మెంబర్ పెరిక సురేశ్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపుగా 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు. బీఆర్ ఎస్కు వ్యతిరేకంగా పార్టీలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. బీసీని సీఎం చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయంతో ఆ సామాజిక వర్గంలో హర్షం వ్యక్తం అవుతుందన్నారు.
కుల సంఘాలు సమావేశాలను నిర్వహించి బీజేపీకి మద్దతు తెలియజేస్తున్నాయన్నారు. బీజేపీ 27 మంది బీసీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించిందన్నారు. బీజేపీ గెలుపు కోసం తనతో కలిసి ఐదుగురు బీసీ నేతలు సుభాశ్ చందర్ జీ, ఆలె భాస్కర్, బూర నర్సయ్య గౌడ్, తూళ్ల వీరేందర్ గౌడ్ లతో కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నియోజకవర్గాల వారిగా కుల సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నమన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, దళిత సీఎం, వారసత్వ రాజకీయాలు, అవినీతి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.