న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హీట్ నెలకొంది. సీజేపీ నిరసనకారులపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ ఇంటి ఎదుట మెరుపు ధర్నాకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ కలిశారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించకుండా ప్రధాని నివాసం ముందు ధర్నా విరమించుకోవాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు.
కానీ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మోడీ నివాసం ముందు ధర్నాను యధావిధిగా కొనసాగిస్తోంది. కాంగ్రెస్ మెరుపు ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని మోడీ నివాసం దగ్గర పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఓ వైపు సీజేపీ నిరసన.. మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాతో ఢిల్లీ దద్దరిల్లుతోంది.
మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా:
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. ప్రధాని మోడీ ఇంటి దగ్గరలో మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే భాగమై ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు.
