న్యూఢిల్లీ: కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఎదుట ఐదు ప్రధాన డిమాండ్లు పెట్టింది. తమ డిమాండ్లపై కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అప్పటి వరకు ప్రధాని నివాసం ముందు నుంచి కదిలే ప్రసక్తే లేదని కాంగ్రెస్ తేల్చిచెప్పింది.
కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై లాఠీఛార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం (జులై 21) ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి యత్నించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రధాని మోడీ ఇంటి దగ్గరలో మెరుపు ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, తదితర కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుండాగిరి, నిరంకుశత్వం నడవదంటూ మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహయ మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీని కలిసి మాట్లాడారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రధాని నివాసం ముందు ధర్నా విరమించుకోవాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. కానీ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మోడీ నివాసం ముందు ధర్నాను యధావిధిగా కొనసాగిస్తోంది.
కాంగ్రెస్ మెరుపు ధర్నా నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని మోడీ నివాసం దగ్గర పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. రాహల్ ను కలిసిన అనంతరం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమిత్ షా దగ్గరకు బయలుదేరారు. కాగా, ఓ వైపు సీజేపీ నిరసన.. మరోవైపు కాంగ్రెస్ మెరుపు ధర్నాతో ఢిల్లీ దద్దరిల్లుతోంది.
కాంగ్రెస్ ఐదు డిమాండ్లు ఇవే
1. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
2. నీట్ పేపర్ లీకేజీపై సభలో హోం మంత్రి ప్రకటన.
3. నీట్ పేపర్ లీకేజీపై సభలో చర్చ.
4. విద్యార్థుల సమస్యలను కేంద్రం వినాలి
5. సీజేపీ నిరసనకారులపై జరిగిన హింసాకాండపై విచారణ
