హైదరాబాద్: పుట్టుకతోనే గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు చేసిన నిమ్స్ వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12 వరకు నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంప్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం. అమరేష్ రావు శనివారం (సెప్టెంబర్ 12) ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
క్యాంప్లోని 19 మంది చిన్నారుల్లో కేవలం 2 కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్స చేయడంపై ముఖ్యమంత్రి వైద్యులను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు.
