హైదరాబాద్: వినాయక చవితి వేళ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని ప్రకటించారు. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబువుతోంది. సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి సందడి మొదలు కానుంది.
ఈ నేపథ్యంలో శనివారం (సెప్టెంబర్ 12) శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.
గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలని కోరారు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్వాహకులకు తెలిపారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని చెప్పారు. నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తానే సమీక్ష నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
గణేశ్ మండపాలకు అతిథులను ఆహ్వానించిన సందర్భాల్లో ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు జరిగినప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు అందించే సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నిమజ్జన ప్రక్రియ సాఫీగా సాగడానికి చెరువుల వద్ద చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేయడానికి అనుగుణంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
