
హైదరాబాద్, వెలుగు : బీజేపీ నేషనల్ లీడర్, నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, అందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ జరిపే విచారణకు ఆయన హాజరు కాలేకపోయారని హైకోర్టుకు బీజేపీ తెలిపింది. సిట్ జారీచేసిన నోటీసు ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ఇచ్చారని, వ్యక్తిగతంగా సంతోష్కు అందలేదని పేర్కొంది. ఢిల్లీ పోలీసుల తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ హైకోర్టుకు ఈ విషయం చెప్పారు.
సంతోష్ను అరెస్టు చేయవద్దని తాము గతంలో ఆదేశించిన తర్వాత విచారణకు ఎందుకు హాజరు కాలేదని హైకోర్టు జడ్జి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ప్రశ్నించగా.. సిట్ విచారణకు ఆయన భయపడడం లేదని, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నందువల్ల ఆయన హాజరు కాలేకపోయారని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్, కరీంనగర్ అడ్వొకేట్ శ్రీనివాస్కు సిట్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేసిన కేసులు, సిట్ దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని, సిట్ వేసిన కేసులపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఆర్డర్ గురించి హైకోర్టు వివరాలు కోరింది. ఆర్డర్ కాపీ రాలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ చెప్పగా బుధవారం జరిగే విచారణలో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏజీ వాదిస్తూ, సిట్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా సంతోష్ సహకరించడం లేదని తెలిపారు. డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్ కుమార్ వాదిస్తూ, సిట్ నోటీసును ఢిల్లీ బీజేపీ ఆఫీసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చారని, అక్కడున్న హేమేందర్ అనే వ్యక్తి నోటీసు తీసుకున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చూసిన తర్వాతే ఈ కేసుల్లో విచారణ ముందుకు వెళ్తామని పేర్కొన్న హైకోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.