బషీర్బాగ్, వెలుగు: షబ్- ఎ -ఖదర్(జాగ్నే కీ రాత్) పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మార్చి 16, 17 తేదీల్లో రాత్రి 10 గంటల తర్వాత కొన్ని ఫ్లైఓవర్లపై బైక్లను అనుమతించబోమని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్(జూ పార్క్ నుంచి ఆరామ్ఘర్ ఫ్లైఓవర్ వరకు), బహదూర్పురా ఫ్లైఓవర్(దేవిబాగ్ నుంచి జూ పార్క్ గేట్ నం.2 వరకు), చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్(నయారా పెట్రోల్ పంప్–హషమాబాద్ ప్రవేశ ద్వారం నుంచి ఫూల్బాగ్ డీఎల్ఆర్ఎల్ వరకు), అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ (పిసల్బండ నుంచి లక్ష్మారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు) మార్గాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
