
- మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ పుస్తక ఆవిష్కరణలో పలువురు వక్తలు
బషీర్ బాగ్, వెలుగు: ప్రత్యేక తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభమైన 2001 నుంచి మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్ మెంట్ దాదాపుగా నిలిచిపోయిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభకాలం నాటి పరిస్థితులు నేడు లేవని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగైందని తెలిపారు. ప్రముఖ పాత్రికేయుడు మంగళారపు లక్ష్మణ్ రచించిన ‘ మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది.
టీఎస్పీఎస్ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి, రాష్ట్ర మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రకాశ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు విఠల్ పాల్గొని మాట్లాడారు. యాభై ఏళ్ల నక్సలైట్ఉద్యమ చరిత్రను సంపూర్ణంగా లిఖించిన చరిత్ర కారులెవరూ లేరన్నారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ప్రాంత ఉద్యమ సంఘటనలు, త్యాగాలను లక్ష్మణ్ రచించినట్లే, తెలంగాణ నలుమూలల నుంచి తమ ప్రాంత విప్లవోద్యమాల చరిత్రను రాయడానికి విశ్రాంత ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, రచయితలు, ఆసక్తి కలిగిన పరిశోధకులు ముందుకు రావాలని వారు కోరారు.