ప్రేమించి పెళ్లి చేసుకుని.. చెల్లె వరుస అని తెలిసి ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకుని.. చెల్లె వరుస అని తెలిసి ఆత్మహత్య

వెల్గటూర్,  వెలుగు :  జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్​రావుపేట గ్రామానికి చెందిన బోగే ప్రసాద్ (23) అనే యువకుడు సోమవారం రాత్రి ఉరేసుకుని చనిపోయినట్లు ఎస్సై నరేశ్​ తెలిపారు.   ప్రసాద్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని మూడు నెలల కింద ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఆమె ప్రసాద్​కు చెల్లె వరుస అవుతుందని  వెంటనే వదిలేయాలని అతన్ని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో  ఆమెను వదిలేసి నెలరోజుల కింద ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ కు వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 22న ఇంటికి తిరిగి వచ్చాడు.

అప్పటి నుంచి మనోవేదనతో ఒంటరిగానే  ఉంటున్నాడు.  తనకు ఇక పెళ్లి కాదేమోనని జీవితంపై విరక్తి చెందాడు.  24న అర్ధరాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతడి కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరకలేదు. ఇంటి నుంచి వెళ్లిన ప్రసాద్  అదే రాత్రి గ్రామంలోని బోగే చిన్నయ్య వ్యవసాయ భూమిలో ఉన్న టేకు చెట్టుకు ఉరేసుకున్నాడు.  మృతుడి తండ్రి బోగే లచ్చయ్య ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.