- అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే..
- కేంద్ర మంత్రి రాణెకు ముంబై హైకోర్టు షాక్
- రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు
- స్టే ఆర్డర్ ఇచ్చేందుకూ నిరాకరణ
ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు ముంబై హైకోర్టు షాక్ ఇచ్చింది. జుహు ఏరియాలో కట్టుకున్న బంగ్లాలోని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, రెండు వారాల్లో వాటిని కూల్చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా కూల్చిన వారంలోపు సబ్మిట్ చేయాలని సూచించింది. అదేవిధంగా రూ.10లక్షల జరిమానాను మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో రెండు వారాల్లో జమ చేయాలని రాణె ఫ్యామిలీకి చెందిన కాల్కా రియల్ ఎస్టేట్ కంపెనీని ఆదేశించింది. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్తో పాటు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రూల్స్ను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారని డివిజన్ బెంచ్ జడ్జిలు జస్టిస్ ఆర్డీ ధనుకా, జస్టిస్ కమల్ ఖటా తెలిపారు.
బీఎంసీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం..
బీఎంసీ ఇచ్చిన పర్మిషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ నిర్మాణాలు చేపట్టినట్టు జడ్జిలు వివరించారు. వీటికి బీఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ తీసుకోలేదన్నారు. నారాయణ్ రాణె కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అంగీకరిస్తే.. అక్రమ కట్టడాలను ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. రాణె ఇంటి కూల్చివేత విషయంలో బీఎంసీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. మున్సిపల్ అధికారులు తనిఖీ చేశాకే.. అక్రమ నిర్మాణాలని తేలాయన్న విషయాన్ని జడ్జిలు గుర్తు చేశారు. ముంబైలో ఇల్లీగల్ కన్స్ర్టక్షన్స్ కూడా పెరిగిపోతున్నాయని అన్నారు. చట్టానికి భయపడకుండా.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఆరు వారాల పాటు స్టే ఆర్డర్ ఇస్తే.. సుప్రీం కోర్టుకు వెళ్తామని రాణె తరఫు అడ్వొకేట్ శార్దుల్ సింగ్ ముంబై హైకోర్టును కోరగా.. అందుకు న్యాయస్థానం తిరస్కరించింది.