
- పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్,
- మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్
- లంగర్హౌస్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ తొట్టెల ఊరేగింపు
- భక్తులతో కిక్కిరిసిపోయిన గోల్కొండ కోట
హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ వేడుకలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. లంగర్హౌస్లో తొట్టెలు, తొలి బోనంగా పిలిచే నజర్ బోనాలకు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్, మంత్రి పొన్నం పోతురాజులతో కలిసి చర్నాకోలాలు చేతిలో పట్టుకుని ఉత్సాహపరిచారు. అనంతరం రథం, తొట్టెల ఊరేగింపు లంగర్హౌస్ చౌరస్తా నుంచి ఫతేదర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తా మీదుగా కోటకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. కోట వద్ద సంప్రదాయ డప్పులు, ఇతర సంగీత వాయిద్యాలతో దరువు వేస్తూ నృత్యాలు చేశారు. పోతురాజులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
600 మంది పోలీసులతో బందోబస్తు..
ఓవైపు తొట్టెల ఊరేగింపు, మరోవైపు భక్తులతో గొల్కొండ ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ వృత్తి కుల సంఘాల ఆధ్వర్యంలో ఉదయం బోనాలు సమర్పించారు. ఆలయ పూజారులు సాయిబాబాచారి, శ్రీకాంత్ చారి, సర్వేశ్వర్ చారి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా కోటలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.
అన్నిచోట్ల మంచినీటి సౌకర్యం కల్పించడంతో పాటు హెల్త్క్యాంపులు, మొబైల్టాయిలెట్లను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోల్కొండ, లంగర్హౌస్పరిసర ప్రాంతాల్లో 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల్లో డిప్యూటీ మేయర్మోతె శ్రీలతరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ శైలజ, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ పోలీస్ కమిషనర్సీవీ ఆనంద్, ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.
మహంకాళికీ బంగారు బోనం..
జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లి అమ్మవారితో పాటు ఈ సంవత్సరం మహంకాళి అమ్మవారికి కూడా బంగారు బోనం సమర్పించారు. జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ తల్లికి పాతబస్తీకి చెందిన ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా బంగారు బోనం సమర్పిస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా ఆలయ పూజారి సాయిబాబా శ్రీకాంత్ చారి ఇంటి నుంచి భారీ ఊరేగింపుతో బంగారు బోనం తీసుకొచ్చి మహంకాళి అమ్మవారికి సమర్పించారు.
కృత్రిమ అంబారీపై అమ్మవారి ఊరేగింపు..
ఆర్టిఫిషియల్ అంబారీ (ఏనుగు)పై అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను చోటాబజార్ నుంచి గోల్కొండ కోటకు తీసుకొచ్చారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీజేపీ నేత మాధవీ లత బోనాలు సమర్పించి పూజలు చేశారు.
అమ్మవారి దయతో వానలు పడాలి: స్పీకర్
అమ్మవారి దయతో సరిపడా వానలు పడి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. ‘‘వర్షాలు బాగా కురిసి, పంటలు పండాలి. ప్రభుత్వంపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి. పథకాలు అమలు చేసే శక్తి, సామర్థ్యాన్ని అమ్మవారు కల్పించాలి” అని కోరుకున్నట్టు తెలిపారు. అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.