
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలు, బల్కంపేట కల్యాణోత్సవం, రథోత్సవం వైభవంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. సోమవారం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాల ఏర్పాట్లపై పోలీస్, రెవెన్యూ, ఆర్అండ్ బీ, ఎండోమెంట్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. జూలై 1న ఎల్లమ్మ దేవాలయంలో జరిగే కల్యాణం, రథోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
గతేడాది ఎదురైన ఇబ్బందులు రిపీట్కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, మహిళలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గతేడాది బారికేడ్లు, క్యూలైన్లలో ఇబ్బందులు తలెత్తాయని, సీసీ కెమెరాలతో నిరంతర భద్రతను పర్యవేక్షించాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ ట్రాన్స్ ఫార్మర్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శానిటేషన్ కోసం అదనంగా ప్రత్యేక సిబ్బందితో పాటు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, మెయిన్ రోడ్డు పై లైటింగ్ డెకరేషన్ఏర్పాటు చేయాలన్నారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉచిత ఫ్యూరిఫైడ్ మంచినీటి సరఫరా ,అదనంగా వాటర్ ట్యాంకర్ల ఏర్పాటు,హెల్త్ క్యాంప్ లు, అంబులెన్స్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర లైవ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణం, రథోత్సవం రోజు సమాచార శాఖ, పోలీస్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ అధికారులు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేయాలన్నారు.
గత సంవత్సరం గుడి లోపల అభిషేకం జరుగుతుంటే భక్తులను ఆపడం వల్ల కొంత తోపులాట జరిగిందని, అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లమ్మ పండుగ అంటేనే ఆట పాట అని, సౌండ్ లేకుండా పండగ ఉండదని, ఎవరికీ ఇబ్బందులు కలగకుండా డీజే బ్యాండ్ ఉంటదని పొన్నం అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్గద్వాల్ విజయ లక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, కలెక్టర్ హరి చందన దాసరి, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్ రావు పాల్గొన్నారు.