హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారం, భోజనం చేయొచ్చని తెలిపారు. ఈ పథకం అమలు కోసం మధ్యాహ్న భోజనం, టీజీ బ్రేక్ఫాస్ట్ పోర్టల్స్లో అవసరమైన మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రతిరోజూ ఎంతమంది సిబ్బంది బ్రేక్ఫాస్ట్, భోజనం చేస్తున్నారనే వివరాలు నమోదయ్యేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని సూచించారు. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలు, హెడ్మాస్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే అల్పాహారం సరఫరా చేసే సెంట్రలైజ్డ్ కిచెన్ ఏజెన్సీలకు కూడా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
