ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • ఎర్ర శేఖర్​తో కలసి పనిచేయలేను
  • కాంగ్రెస్​జడ్చర్ల ఇన్​చార్జి అనిరుధ్​రెడ్డి  
  • రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​కు లేఖ

మహబూబ్​నగర్​, వెలుగు : ఇటీవల పార్టీలో చేరిన ఎర్ర శేఖర్ తో కలిసి పనిచేయలేనని​  మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఇన్​చార్జి జనుంపల్లి అనిరుధ్​రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ ​పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​కు ఆయన లెటర్​ రాశారు. పదేళ్లుగా జడ్చర్ల కాంగ్రెస్​పార్టీలో పని చేస్తున్నానని చెప్పారు.  జూన్​ 7న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి సమక్షంలో హైదరాబాద్​లో కాంగ్రెస్​లో చేరారు. అప్పటి నుంచి జడ్చర్ల కాంగ్రెస్​లో కల్లోలం ఏర్పడిందన్నారు. ఎర్ర శేఖర్​ చేరికపై అదే నెల 11న పార్టీ  స్టార్​క్యాంపెయినర్​కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో కలిసి అనిరుధ్​రెడ్డి పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్​తో చర్చలు జరిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శేఖర్​ను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.  గతంలో ఎర్ర శేఖర్​ టీడీపీ నుంచి పాలమూరు అసెంబ్లీ  కి పోటీ చేసి ఓడిపోయారని, ఇప్పుడెందుకు కాంగ్రెస్​లో చేరారో బహిర్గతం చేయాలని డిమాండ్​చేశారు. పార్టీ ఇలాగే వ్యవహరిస్తే  జడ్చర్ల మరో హుజూరాబాద్​ అవుతుందని హెచ్చరించారు. హుజూరాబాద్​లో కాంగ్రెస్​కు మూడు వేల ఓట్లు వచ్చాయని, జడ్చర్లలో రెండు వేల ఓట్లు కూడా రావని అన్నారు. కాంగ్రెస్​లో చేరే టీడీపీ లీడర్ల కాంగ్రెస్​క్యాడర్​ఇబ్బంది పడుతోందని అనిరుధ్​రెడ్డి లేఖలో పేర్కొన్నారు.  

  • వనపర్తిలో త్వరలో రైతు సదస్సు
  • మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు:  ప్రత్యామ్నాయ పంటల సాగుపై త్వరలో వనపర్తి జిల్లా కేంద్రంలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి, గోపాల్ పేట  మండలాల్లో ఆయన పర్యటించారు.   ‘మన ఊరు– - మన బడి’ పథకంతో ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు ప్రైవేటు విద్య మోజులో డబ్బులు వృథా ఖర్చు చేయొద్దని సూచించారు.  వనపర్తిలో రూ.510 కోట్లతో మెడికల్​కాలేజీ,180 బెడ్స్​కెపాసిటీతో మాతాశిశు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.  అనంతరం గోపాల్ పేట మండలం  తాడిపర్తి ప్రైమరీ స్కూల్​లో రూ.57.90 లక్షలతో నిర్మించబోయే  తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్పీ హైస్కూల్​లో  రూ.75 లక్షలతో నిర్మించే మరో నిర్మాణానికి  భూమిపూజ చేసి, కస్తూర్భాగాంధీ  స్కూల్లో రూ.2  కోట్లతో కొత్తగా నిర్మించిన జూనియర్  కాలేజీ తరగతి గదులు, హాస్టల్​బిల్డింగ్​ను  ప్రారంభించారు. 

  •  శాస్త్ర ప్రకారమే సింగోటం ఆలయ పునర్నిర్మాణం

నాగర్​కర్నూల్, వెలుగు:  శాస్త్ర ప్రకారం సింగోటం  శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ  పునర్నిర్మాణం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం కొల్లాపూర్​ మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,  ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ  దక్షిణ యాదాద్రిగా పిలిచే ఆలయ పునర్నిర్మాణానికి సీఎం కేసీఆర్ ​స్పెషల్​ఫండ్స్​ నుంచి రూ. 15 కోట్లు  శాంక్షన్​ చేశారని తెలిపారు.  

  •  పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా  తేవాలి 
  •  టీపీసీసీ అధికార ప్రతినిధి  హర్షవర్ధన్ రెడ్డి 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లా బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ, నాగూరావు నామాజీలు ప్రధానితో మాట్లాడి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం డీసీసీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని విమర్శించారు. బీజేపీ నేతలు హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే టీఆర్ఎస్ వచ్చాక రీ డిజైన్​ల పేరుతో సీఎం కేసీఆర్  ప్రజలను, రైతులను మోసం చేశారని ఆరోపించారు. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా మీడియా సెల్ కన్వీనర్  సీజే బెనహర్, నాయకులు లక్ష్మణ్ యాదవ్  పాల్గొన్నారు.  

  • నల్లమల ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే

అచ్చంపేట, వెలుగు: నల్లమల ప్రజల సమస్యలను గాలికి వదిలి ఎమ్మెల్యే తన సొంత లాభం కోసం పని చేస్తున్నాడని, వలస వచ్చిన ఎమ్మెల్యేను అచ్చంపేట పొలిమేర దాటే వరకు తరిమి కొడతామని నాగర్ కర్నూల్​ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ కృష్ణ ఆరోపించారు. అచ్చంపేట పట్టణంలో నిర్మించిన 100 బెడ్స్​హాస్పిటల్​ నిర్మాణం పూర్తయినా ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నాడని  హాస్పిటల్​ ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.  ధర్నా శిబిరానికి వచ్చిన పోలీసులు  బ్లాక్​కాంగ్రెస్ ​ప్రెసిడెంట్​గోపాల్​రెడ్డి, కౌన్సిలర్​ గౌరీశంకర్​లను అరెస్ట్​చేయడంతో ఆగ్రహించిన కాంగ్రేస్ శ్రేణులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.  

  • మునుగోడు సభను సక్సెస్ చేయండి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మునుగోడులో ఈ నెల 21న నిర్వహించనున్న బహిరంగసభకు జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా ఆఫీస్​లో జిల్లా స్థాయి నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. పాలమూరు జిల్లా నుంచి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, నంబిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి, కోశాధికారి పాండురంగారెడ్డి, సత్యం, మున్సిపల్  ఫ్లోర్  లీడర్  ఎ.అంజయ్య, టౌన్ ప్రెసిడెంట్ పోతుల రాజేందర్ రెడ్డి, యు.నాగరాజు, సతీశ్ కుమార్  పాల్గొన్నారు.