
- రూ.85 కోట్లు సమీకరించిన బృహస్పతి టెక్నాలజీస్
- హైదరాబాద్లో ప్లాంటు..రూ.70 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, వెలుగు: ఏఐ నిఘా, సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్ కంపెనీ బృహస్పతి టెక్నాలజీస్ ఎఫ్ఐఐలు, ఇతరుల నుంచి 10 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.85.68 కోట్లు) సమీకరించింది. ఈ డబ్బును విస్తరణకు ఉపయోగిస్తామని తెలిపింది. హైదరాబాద్ తునికిబొల్లారంలో 72వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సీసీటీవీల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికల్లా ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుంది. దీనికోసం రూ.70 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ఎండీ పాపోలు రాజశేఖర్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలోచెప్పారు. వృద్ధి వ్యూహాల్లో భాగంగా కంపెనీ అదనంగా 400 మంది ఉద్యోగులను నియమించుకోనుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓకు వెళ్లనుంది. దీనిద్వారా వచ్చే నిధులతో ఆర్ అండ్ డీని బలోపేతం చేసుకోవాలని, ఏఐ ఆధారిత పరిష్కారాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది. బృహస్పతి టెక్నాలజీస్ సంస్థకు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్టీసీ) నుంచి నిఘా ప్రాజెక్టు దక్కింది. ఎంఎస్ఆర్టీసీ సంస్థ నెట్వర్క్ వ్యాప్తంగా ఏఐ ఆధారిత సీసీటీవీ సిస్టంలను అమర్చుతామని రాజశేఖర్చెప్పారు.