హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఏంటో తెలిసేదని పేర్కొన్నారు. కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఆదివారం (డిసెంబర్ 21) తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. నన్ను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని.. నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదని.. తెచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యూరియా ఇంటికి, చేను వద్దకే వచ్చేదని.. కానీ ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా క్యూలైన్లో నిలబడే పరిస్థితి దాపరించిందని విమర్శించారు. రేండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించకపోగా ఉన్నవాటిని ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
