అదానీ కంపెనీలపై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన రిపోర్టుపై చర్చ చేపట్టాలని పార్లమెంటు ఉభయసభల్లో బీఆర్ఎస్ తీర్మానం ప్రవేశ పెటింది. ఈ నివేదికతో దేశ ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని వాదించింది. ఈ అంశంలో బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఇయ్యాళ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. రూల్ 267 కింద చర్చ చేపట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇక లోక్సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదు అదానీ గ్రూపు పాల్పడిన ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. 267 చట్టం కింద ఈ అంశాన్ని చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కోరారు. అదానీ గ్రూపు మోసానికి పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.