
- రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా పోటీల నిర్వహణ
- తొమ్మిదేండ్లుగా పట్టించుకోని ఆలయాలకు ఇప్పుడు ఫండ్స్
- నియోజకవర్గాల్లో వందలాది గుడుల నిర్మాణాలకు విరాళాలు
- అసెంబ్లీ ఎన్నికల్లోపే పనులు అవ్వాలని డెడ్లైన్లు
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటంతో అధికార బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా బీజేపీ ఓటు బ్యాంకుపై గురి పెట్టింది. చేసిన అభివృద్ధి పనులు, తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్తూనే.. కమలం పార్టీకి దన్నుగా నిలిచే హిందుత్వ, యూత్ ఓటర్లే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. యువ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘సీఎం కప్ 2023’ను తెరపైకి తెచ్చింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అధికారికంగానే సోమవారం నుంచి పోటీలు ప్రారంభించింది. దాదాపు 4 లక్షల మంది పాల్గొంటారనే అంచనాతో భారీ ఏర్పాట్లు చేసింది. మరోవైపు తొమ్మిదేండ్లలో యాదాద్రిని తప్ప ఏనాడూ, ఏ ఒక్క ఆలయాన్నీ పట్టించుకోని సర్కారు.. ఇప్పుడు ఇతర ప్రధాన ఆలయాలు, జిల్లాల్లోని గుళ్లు, గోపురాల నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. ఆలయాల అభివృద్ధి కోసం అడిగిన వెంటనే ఫండ్స్ కేటాయిస్తోంది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాల్లో గుళ్లు, గోపురాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించడంతో పాటు లక్షలకు లక్షలు చందాలు రాస్తున్నారు.
ఉన్నట్టుండి గుర్తొచ్చిన ఆలయాలు
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో కేవలం యాదాద్రి టెంపుల్ పునర్నిర్మాణంపైనే దృష్టి పెట్టారు. ప్రధాన ఆలయం, రింగ్రోడ్డు, ఇతర సుందరీకరణ పనులకు రూ.1,200 కోట్లకు పైగా ఖర్చు చేశారు. రాష్ట్రంలో అంతే ప్రముఖ దేవాలయమైన వేములవాడ అభివృద్ధికి నాలుగేండ్ల పాటు ప్రతి బడ్జెట్లో రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని 2015 జూన్ 18 న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించినా పైసా కేటాయించలేదు. ఫలితంగా వేములవాడ మాస్టర్ ప్లాన్ అటకెక్కింది. తీరా ఎన్నికల ఏడాది కావడంతో సీఎం కేసీఆర్కు ఉన్న ఫలంగా టెంపుల్స్ గుర్తుకువచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి స్పెషల్ ఫండ్స్ కింద రూ.100 కోట్లు మంజూరు చేశారు. మూడు నెలల కింద ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడవీధుల నిర్మాణం, రాజగోపురం కోసం రూ.30 కోట్లను మంజూరు చేశారు. ఇదే వరంగల్ జిల్లాలోని వల్మిడీ రామాలయం, సోమనాథుడి ఆలయం, బమ్మెర పోతన స్మారక భవనం, తదితర పనులకు రూ.63 కోట్ల 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. బాన్సువాడ నియోజకవర్గం తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల ఆలయ అభివృద్ధికి గతంలో రూ.20 కోట్లు కేటాయించగా.. రెండు నెలల క్రితం కేసీఆర్ పర్యటన సందర్భంగా మరో రూ.7 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ కోకాపేటలోని హరేకృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.25 కోట్లిస్తామని ఇటీవలే సీఎం ప్రకటించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సొంత జిల్లాలోని బాసర సరస్వతి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ పేరిట రూ.50 కోట్లు, నిర్మల్ అడెల్లి పోచమ్మ ఆలయానికి రూ.12 కోట్లు, మహాలక్ష్మి ఆలయానికి రూ.3 కోట్లు ఖర్చు చేశారు. సంగారెడ్డిలో కోహీర్ మండలం బడంపేట భ్రమరాంబ రాచన్న స్వామి దేవాలయానికి మంత్రి హరీశ్రావు ఇటీవల రూ.2 కోట్లు మంజూరు చేయించారు. టీటీడీ సహకారంతో కరీంనగర్లో నిర్మించనున్న వెంకటేశ్వర ఆలయానికి స్థానిక పద్మానగర్లో ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించగా, సోమవారం ముహూర్తం పెట్టారు. నియోజకవర్గాల్లో గతానికి భిన్నంగా మంత్రులు, ఎమ్మెల్యేలు.. కొత్తగా నిర్మించే వందలాది గుళ్లు, ఆలయాలకు తమ వంతుగా ఫండ్స్ కేటాయిస్తున్నారు. చందాలు ఇస్తున్నారు. తెలిసిన దాతలతో విరాళాలు ఇప్పిస్తున్నారు. హనుమాన్ ఆలయాలకైతే అడగ్గానే మంత్రులు, ఎమ్మెల్యేలు ఫండ్స్, విరాళాలు అందిస్తున్నారు.
ఎన్నికల ఏడాదే పోటీలు
రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగాల భర్తీ లేకపోవడం, గత ఎన్నికల ముందు అధికార పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయకపోవడం, టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్వన్ తదితర పోస్టుల భర్తీ ప్రక్రియ పేపర్ లీకేజీల కారణంగా నిలిచిపోవడంతో కేసీఆర్ సర్కారుపై స్టూడెంట్లు, నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో ఎక్కువ శాతం యూత్ బీజేపీ ఫాలోవర్స్గా ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించిన పలు సర్వేల్లోనూ తేలింది. మరోవైపు గతేడాది ఆటగాళ్ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి అందరికీ స్పోర్ట్స్ కిట్లు అందజేస్తామని చెప్పినా అది సక్సెస్ కాలేదు. చాలా చోట్ల గ్రౌండ్లు పూర్తికాలేదు. పూర్తయిన చోట్ల వినియోగంలోకి రాలేదు. స్పోర్ట్స్ కిట్లు ఎక్కడా అందలేదు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల గడువు మాత్రమే ఉండటంతో గ్రామీణ, మండలాల పరిధిలోని యువతను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ నేతలు క్రీడాపోటీలకు ప్లాన్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా చీఫ్ మినిస్టర్ కప్ 2023 పేరుతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆధ్వర్యంలో పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర స్పోర్ట్స్అథారిటీ ద్వారా అఫీషియల్గా ఈ నెల 28 వరకు పోటీలు పెట్టి, 29న బహుమతులు అందజేయనున్నారు. 10 వేల మంది క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు పెడుతున్నట్లు చెబుతున్నా.. ఇందులో రాజకీయ కోణం స్పష్టంగా కనపడుతోంది. ఎనిమిదేండ్లలో ఎప్పుడూ లేనిది, ఎన్నికల ఏడాది ఇలాంటి పోటీలు నిర్వహించడాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.