ములగు/ గ్రేటర్ వరంగల్/ హసన్పర్తి/ భూపాలపల్లి రూరల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. హామీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. మంగళవారం ములుగు, హనుమకొండ, భూపాలపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన మీడియా సమావేశాల్లో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు తదితర వర్గాల సమస్యలను ఈ కార్యక్రమాల్లో ప్రస్తావిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమరభేరి కార్యక్రమాలకు అనుమతి కోరుతూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎస్పీ సంకీర్త్కు వినతిపత్రం అందజేశారు.
