
- సిటీలో 65 వేల ఇండ్లు పంపిణీ చేసిన గత సర్కార్
- వీటిల్లో 5 వేల మంది కూడా ఉండని పరిస్థితి
- నీళ్లు, విద్యుత్ తదితర ప్రాబ్లమ్స్ తో సతమతం
- స్థానికులు అధికారులకు చెప్పినా నో రెస్పాన్స్
- బ్లాక్ ల వారీగా వాట్సాప్ గ్రూప్ లు ఏర్పాటు
- సొంత డబ్బులతో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్
హైదరాబాద్, వెలుగు : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రానోళ్లు బాధపడుతుండగా.. వచ్చినోళ్లు ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇండ్లు అలాట్ అయినవారిలో కొందు ఇప్పటికే వెళ్లి ఉంటుండగా.. తాగునీరు, విద్యుత్ తదితర సౌలతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బ్లాక్ లో ఒక్కో సమస్య ఉంది. బ్లాక్ ల వారీగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేసుకుని తాము పడే ఇబ్బందులను చెప్పుకుంటున్నారు. తమ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లబ్ధిదారులు సొంత ఖర్చుతో పైపుల మరమ్మతులు చేయించినా కూడా ఇబ్బందులు తొలగడంలేదు. కనీస సౌలతులు కూడా కల్పించకుండానే గత ప్రభుత్వం అందజేసింది. మెయింటెనెన్స్ లోపంతోనే ఇలా జరుగుతుంది. ప్రతాప సింగారంలో 2,208 మందికి డబుల్ ఇండ్లను ఇవ్వగా.. ప్రస్తుతం 300 - 400 మంది మాత్రమే ఉంటుండగా వారికి వాటర్ సప్లై చేసేందుకు నలుగురు లైన్ మెన్లు ఉండాల్సిఉన్నప్పటికీ ఒక్కరూ కూడా లేరు. ఇండ్లను నిర్మించిన కాంట్రాక్టర్లు రెండేంట్ల పాటు మెయింటెనెన్స్ చేయాలనే నిబంధన ఉంది. అయితే వీటిని నిర్మించి నాలుగేండ్లు అవుతుండగా కాంట్రాక్టర్లు కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. నిర్మించిన చోట వందల్లో ఇండ్లు ఇంకా లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉండగా వాటి కోసమే కాంట్రాక్టర్లు సైట్లలో ఉంటున్నారు.
5 వేల మంది కూడా పోలేదు..
గ్రేటర్ సిటీలో లక్ష డబుల్ ఇండ్లను నిర్మించి ఇస్తామని గత బీఆర్ఎస్సర్కార్ హామీ ఇచ్చింది. ఇందుకు 49 మురికివాడల్లో 9,828, 68 ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్లను బల్దియా చేపట్టింది. వీటిలో 69 వేల ఇండ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మిగతా వాటిలో కొన్ని నిర్మాణ దశలో ఉండగా, ఇంకొన్ని పనులు మొదలే పెట్టలేదు. అధికంగా కొల్లూర్ లో 15,660 ఇండ్లను నిర్మించింది. పోచారంలో 6 వేలు, ప్రతాపసింగారంలో 2200.. ఇలా దుందిగల్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో ఒకేచోట వేలల్లో ఇండ్లను నిర్మించింది. కానీ.. అన్ని పనులు పూర్తిచేయలేదు. లబ్ధి కోసమని గత బీఆర్ఎస్ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కోడ్ కి కొద్దిరోజుల ముందు ఒకేసారి 65 వేల ఇండ్లను అందిస్తున్నామని, కలెక్టరేట్లలో లాటరీ ద్వారా ఇండ్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు లాటరీ కూడా నిర్వహించింది. లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పట్టాలు కూడా ఇచ్చింది. కొందరికి ఇండ్ల తాళాలు కూడా అందజేసింది. అయితే తాళాలు అందుకున్న వారు నేటికి కూడా ఇండ్లలోకి వెళ్లలేకపోతున్నారు. అప్పగించిన 65 వేల ఇండ్లలో 5 వేల మంది కూడా వాటిలో ఉండడంలేదు.
రిపేర్లకే వందకోట్లు కావాలి
గ్రేటర్ సిటీలో డబుల్ ఇండ్లకు మరో రూ.300 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి బల్దియా తెలిపింది. గతంలో చేసిన పనులకు రూ.200 కోట్లు, రిపేర్లకు రూ.100 కోట్ల అవసరముందని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన రివ్యూలో బల్దియా అధికారులు చెప్పారు. రెండు, మూడేండ్ల కిందట నిర్మించిన ఇండ్లను అర్హులకు కేటాయించకుండా ఖాళీగా ఉంచడంతోనే రిపేర్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. నిర్మించిన వెంటనే అప్పగించి ఉంటే లబ్ధిదారులు ఇండ్లలోకి వెళ్లిపోయేవారని పేర్కొన్నారు. గత సర్కార్ పట్టించుకోకుండా ఎన్నికలకు ముందు పట్టాలు అందించిందని చెప్పారు. సమస్యలను పరిష్కరిస్తేనే లబ్ధిదారులు వెళ్లేందుకు వీలవుతుందని వివరించారు. ప్రస్తుతం ఉన్న ఇండ్ల పరిస్థితి, చేపట్టాల్సిన పనుల, ఖర్చు వంటి వాటిపై వివరాలను అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. పట్టాలు పంపిణీ చేసిన వారి ఇండ్లలో ఇంకా పనులు పూర్తికాలేదు. చాలామందికి తాళాలు కూడా ఇవ్వలేదు. ఆయా మరమ్మతు పనులు పూర్తయ్యేంత వరకు ఇండ్లలోకి పోలేని పరిస్థితి నెలకొంది.
సౌలతులు కల్పించాలి
డబుల్ ఇండ్లు ఇచ్చినా సౌలతులు కల్పించలేదు. నీళ్లు, కరెంట్ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలి. గ్రామ పంచాయతీ, జీహెచ్ఎంసీ పరిధిలోకి రాకుండా పోవడంతో ఎవరూ పట్టించుకోవడంలేదు.
– రఘురామచారి, ప్రతాప సింగారం
నీళ్లు కొంటున్నం
తాగునీటితో పాటు వాడుకునేందుకు కూడా కొంటున్నం. ఉద్యోగులను నియమించకపోవడం, ఉన్నవారు డబ్బులెవరిస్తే వారికే స్పందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎండలు ముదిరితే పరిస్థితి దారుణంగా ఉంటుంది.
– యాకయ్య, ప్రతాప సింగారం