
- స్పందించిన సీఎం పేషీ.. వీడియో ఫేక్ అని నిర్ధారణ
- ఎక్స్లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్(యూఎస్ఏ) అకౌంట్ నిర్వాహకుడిపై
- కేసు నమోదు ఆస్పత్రి ప్రతిష్టను
- దెబ్బ తీయొద్దని కోరిన గాంధీ సూపరింటెండెంట్
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రికి సంబంధించిన ఫేక్ వీడియోను బీఆర్ఎస్(యూఎస్ఏ) తన ఎక్స్ అకౌంట్ నుంచి తొలిగించింది. పొరపాటున పాత వీడియోను పోస్టు చేసినట్లు బీఆర్ఎస్(యూఎస్ఏ) అకౌంట్ నిర్వాహకుడు హరీశ్రెడ్డి వెల్లడించారు. ఇందుకు క్షమాపణలు చెబుతున్నానంటూ ఎక్స్లో మంగళవారం మరో వీడియో పోస్టు చేశారు. పొరపాటును గమనించి వెంటనే తన ఎక్స్అకౌంట్ నుంచి వీడియోను డిలీట్ చేశానని వివరించారు.
అయినా, కాంగ్రెస్ నేతల ఒత్తిడితో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తనపై కేసు పెట్టారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడం కాదని, కోట్లాది మంది ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డిపైనే ముందు కేసు పెట్టాలని హరీశ్రెడ్డి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వ పనితీరు దరిద్రంగా ఉందని, సీఎం రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ హరీశ్రెడ్డి.. మూడు రోజుల కింద గాంధీ ఆస్పత్రిపై ఓ వీడియోను ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీనిపై సీఎం ఆఫీస్ఎంక్వైరీ చేపట్టగా.. వీడియోలో ఉన్నది నిజం కాదని తేలింది. పాత క్లిప్పింగ్లతో డీప్ఫేక్ద్వారా తప్పుడు వీడియోను క్రియేట్ చేశారని నిర్ధారణ అయ్యింది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్రాజారావు చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హరీశ్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదుతో ఐటీ, ఐపీసీ 505 క్లాజ్2 సెక్షన్ల కింద హరీశ్ రెడ్డిపై సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు. హరీశ్రెడ్డి అమెరికా నుంచి ఇండియాకు రాగానే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ సెక్షన్ల కింద హరీశ్రెడ్డికి ఐదేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
గాంధీ ఆస్పత్రిపై నిందలు సరికాదు
పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఓ దేవాలయంగా పనిచేస్తున్న గాంధీ ఆస్పత్రిపై కొందరు పనిగట్టుకొని నిందలు వేయడం సరికాదు. పేదలకు కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తూ, వారి ప్రాణాలను కాపాడుతున్నాం. కరోనా టైంలో బెడ్లు సరిపోలేనంత పేషెంట్లు వచ్చినప్పటికీ మా వైద్య సిబ్బంది అక్కున చేర్చుకుంది. తమ ప్రాణాలను తెగించి, పేషెంట్లను కాపాడిన సంగతి తెలియంది కాదు. వైద్య సిబ్బందిని ప్రోత్సహించాల్సింది పోయి , వారిపై ఫేక్ అలిగేషన్స్చేస్తున్నారు. ఇలాంటి పనులతో డాక్టర్ల మనోదైర్యాన్ని, ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయకండి.
ప్రొ.రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్