అసెంబ్లీ సెషన్ తర్వాత నల్గొండలో బీఆర్ఎస్ సభ

అసెంబ్లీ సెషన్ తర్వాత నల్గొండలో బీఆర్ఎస్ సభ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. 2 లక్షల మందిని ఈ సభకు తరలించి వారి సమక్షంలో కృష్ణా బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై చెప్పాలని నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించే శ్వేతపత్రాన్ని కౌంటర్ చేస్తూ నల్గొండ బహిరంగ సభలో ప్రజల సమక్షంలోనే కేసీఆర్ స్వేదపత్రం ప్రకటిస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించి తెలంగాణకు ఎలా అన్యాయం చేసిందో వివరించే కరపత్రాలను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సభ తేదీని కేసీఆర్ ప్రకటిస్తారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి.