ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలదీస్తే సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ సీఎం పదవిలో ఉండి.. స్థాయికి తగ్గట్లు మాట్లాడటం లేదన్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. నీళ్ళు నిధులు అన్ని గజ్వేల్ కేనా అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీఎం... ఇప్పుడేమో గజ్వేల్ అభివృద్ధి ఇందిరాగాంధీ హయాంలోనే అయిందని అంటున్నారని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గ బీఅర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో హరీశ్రావు పాల్గొన్నారు.
గజ్వేల్ కు సిద్దిపేటకు రైలు తెచ్చింది కేసీఆరేనని చెప్పారు హరీశ్రావు. మూడు యూనివర్శిటీలు తెచ్చింది కేసీఆరేనని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో కనీసం త్రాగు నీరు కూడా ఇవ్వలేదని .. సాగు నీరు, త్రాగు నీరు ఇచ్చింది కేసీఆర్ అని గుర్తుచేశారు. సింగూర్ జలాలను మెదక్ కే దక్కేలా చేసింది కేసీఆరేనని చెప్పారు. పార్టీలు మారిన వారిని తక్షణమే అనర్హత వేస్తామని అని రాహుల్ గాంధీ మానిఫెస్టోలో పెట్టారని.. రేవంత్ మాత్రం పార్టీలు మారిన వారికి ఖండువాలు కప్పుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు. అందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చిన అని రేవంత్ రెడ్డి అంటున్నారని.. నీ పదవి కోసం ఎవరిని అయినా తొక్కుతావని విమర్శించారు.