
- తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్?
- తెలంగాణ తెచ్చినందుకా.. డెవలప్ చేసినందుకా?
- బొందపెట్టుడు తర్వాత.. ముందు హామీలు నెరవేర్చు
- హామీలపై తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టం
- కరెంట్ బిల్లులు కట్టొద్దు.. వాటిని సోనియాకు పంపాలి
- బీఆర్ఎస్కు బీజేపీతో పొత్తు ఉండబోదని ప్రకటన
- కాంగ్రెస్కు రేవంత్ ఏక్నాథ్ షిండేలా మారుతారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రస్థానంలో రేవంత్రెడ్డి లాంటి వాళ్లను ఎంతో మందిని చూశామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘రేవంత్రెడ్డిలా అహంకారంతో మాట్లాడిన నాయకులను ఎంతో మందిని చూసినం. బీఆర్ఎస్ను వంద మీటర్ల లోపల బొందపెట్టే సంగతి తర్వాత.. ముందు హామీలను వంద రోజుల్లో నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి” అని వ్యాఖ్యానించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘రేవంత్ లెక్కనే ఎందరో మఖలో పుట్టి పుబ్బలో పోతదని బీఆర్ఎస్పై నీలిగిండ్రు.. రెండున్నర దశాబ్దాలుగా పార్టీ నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది” అని ఆయన అన్నారు.
‘‘తెలంగాణ జెండాను ఎందుకు బొందపెడ్తవ్? .. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మల్ని, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతయ్.. రేవంత్ కాంగ్రెస్కు ఏక్ నాథ్ షిండేగా మారతడు.. రేవంత్ రక్తం బీజేపీదే.. ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారిండు.. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదానీతో అలయ్బలయ్ చేసుకున్నడు.. అదానీ, రేవంత్ రెడ్డి ఒప్పందాల లోగుట్టు బయటపెట్టాలి..” అని కేటీఆర్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అని గతంతో చెప్పిన రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్గా మారారని విమర్శించారు.
కరెంట్ బిల్లులు కట్టొద్దు
రాష్ట్ర ప్రజలు జనవరి నెల కరెంట్ బిల్లులు కట్టొద్దని, ఉచిత కరెంట్ఇస్తామన్న కాంగ్రెస్ హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అన్నారు. ‘‘బిల్లుల వసూళ్ల కోసం వచ్చే అధికారులకు ఎన్నికలకు ముందు రేవంత్ మాట్లాడిన వీడియోలు చూపించాలి. ప్రతి ఇంటికి వస్తున్న కరెంట్ బిల్లుల కాపీలను సోనియా గాంధీ నివాసం 10 జన్పథ్కు పంపాలి” అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ప్రతి మీటర్కు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంట్ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిరాయి ఇండ్లలో ఉండేవాళ్లకు ఈ సదుపాయం కల్పించాలన్నారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ప్రతి మహిళలకు నెలకు రూ.2,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల హామీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీజేపీతో తాము ఇప్పటి వరకు పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్లోనూ ఉండబోదన్నారు.
సికింద్రాబాద్కు కిషన్రెడ్డి ఏం చేశారు?
ఎంపీగా, కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఐదేండ్లలో కిషన్రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ లిఫ్టులను కేంద్ర మంత్రి జాతికి అంకితం చేశారు. ఆయన చేసిన అతిపెద్ద పని అది మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం 36 ఫ్లై ఓవర్లు కడితే.. కేంద్రం ఉప్పల్, అంబర్పేట ఫ్లై ఓవర్లను కట్టలేక చేతులెత్తేసింది. హైదరాబాద్లో గులాబీ జెండాకు ఎదురులేదు” అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడినా ఎప్పటికీ ప్రజల పక్షమేనని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ 50 రోజుల పాలనలో ఆటోడ్రైవర్లు మొదలు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతుబంధు ఇంతవరకు ఇవ్వలేదని, కాంగ్రెస్ హామీల అమలుపై స్పష్టత లేదని దుయ్యబట్టారు. మైనార్టీల సమస్యలపై పది రోజుల్లో తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని మైనార్టీ ముఖ్య నేతలను సమావేశానికి ఆహ్వానించి, అన్ని అంశాలపై చర్చిద్దామని నేతలకు సూచించారు.
మమ్మల్ని పట్టించుకోలే: కార్యకర్తలు
కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుంచి పని చేస్తున్నా తమను కనీసం పట్టించుకోలేదని హైదరాబాద్కు చెందిన పలువురు కార్యకర్తలు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ జెండా మోసినోళ్లకు గుర్తింపు లేకుండా పోయిందని, వేరే పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు, ప్రాధాన్యం దక్కిందని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నా ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. ‘‘పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన. నా ఇల్లు కూడా అమ్ముకున్న. పార్టీ నన్ను ఆదుకోలేదు” అని ఓ మహిళా కార్యకర్త కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇకనైనా కేడర్ను పట్టించుకోవాలని సూచించారు.