జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలోని ప్రగతి నగర్ కమాన్ వద్ద మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గండి మైసమ్మ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఓపెన్ ప్లేస్లో కొంతమంది పదుల సంఖ్యలో ఫర్నిచర్ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి ఈ ఫర్నిచర్స్ దుకాణాలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. వరుసగా దుకాణాలు ఉండడంతో సుమారు 25 దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చాలాసేపటి వరకు మంటలు అదుపులోకి రాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఫర్నిచర్ దుకాణం వద్ద షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించి ఆ మంటల్లో ఓ గ్యాస్ సిలిండర్ పేలినట్లు సమాచారం. అర్ధరాత్రి వరకు వరకు మంటలు అదుపులోకి రాలేదు.
