మళ్లా మంత్రినైతనేమో! 

మళ్లా మంత్రినైతనేమో! 
  •  ఐదేండ్లలో ఏదైనా జరగొచ్చు: మల్లారెడ్డి 
  • త్వరలోనే సీఎం రేవంత్​ను కలుస్త
  • కాంగ్రెస్ గెలుస్తదని కలలో కూడా అనుకోలేదు
  • ఆ షాక్ నుంచి మేమింకా తేరుకోలేదు 
  • మీడియాతో మాజీ మంత్రి చిట్ చాట్  

హైదరాబాద్, వెలుగు: మళ్లా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టముంటే, రాసి పెట్టి ఉంటే ఐదేండ్లలో ఏదైనా జరగొచ్చునని ఆయన అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్​చాట్​చేశారు. బీఆర్ఎస్​ఓడిపోయి కాంగ్రెస్​ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన అన్నారు. 

తాము ఇంకా ఆ షాక్​నుంచి తేరుకోలేదని చెప్పారు. డెవలప్​మెంట్​కోసం సీఎంను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి, నేను గతంలో టీడీపీలో కలిసే పని చేశాం. త్వరలోనే  సీఎం రేవంత్​రెడ్డిని కలుస్తాను. నేను సీఎంను కలిసే టైమ్ లో ఎలాంటి చర్చకు తావివ్వను. మీడియాకు ముందే సమాచారం ఇచ్చి సీఎంను కలుస్తాను” అని తెలిపారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని బీఆర్ఎస్ అధిష్టానం తనను కోరుతున్నదని, కానీ తాను మాత్రం తన కొడుకు భద్రారెడ్డికి టికెట్​ఇవ్వాలని అడుగుతున్నానని చెప్పారు.