- లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి తమ్ముడు కొండల్ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్ల విలువైన భూములను కేటాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 ఎకరాల ప్రజా భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టారని మండిపడ్డారు. శుక్రవారం ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులతో కలిసి లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు.
శ్రవణ్ మాట్లాడుతూ.. ఏరోస్పేస్ కంపెనీ అని చెప్పుకుంటున్న టెస్సెరాక్ట్ చెల్లించిన మూలధనం కేవలం రూ.లక్ష మాత్రమేనని, ఆ కంపెనీ అధికారిక బోర్డు నివేదిక ప్రకారం ఉద్యోగుల సంఖ్య సున్నా అని తెలిపారు. ఒక నివాస ఫ్లాట్ అడ్రస్తో నడుస్తున్న కంపెనీకి రూ.200 కోట్ల విలువైన భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ ఆడిట్ సైట్ నుంచి ఫొటోలు దొంగిలించి ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెబ్సైట్లో ఫేక్ నంబర్ ఉందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిలదీయడంతో రాత్రికి రాత్రే దానిని మార్చేశారన్నారు.
