ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి..కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి : ఎమ్మెల్సీ కవిత

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి..కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి : ఎమ్మెల్సీ కవిత

NDTV కి కవిత ప్రత్యేక ఇంటర్వ్యూ

ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని వీడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.  ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయని, కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలు చెందాయని మాట్లాడారు. ప్రతిపక్షాలు ఏకమవ్వడంలో సవాళ్లు ఏమీ లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే అన్నారని, కానీ.. దేశంలో అన్ని చోట్లలో కాంగ్రెస్ కి బలం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 4 వేలకుపైగా ఎమ్మెల్యే స్థానాలు ఉంటే.. అందులో కాంగ్రెస్ కు కేవలం 6300 వరకు సీట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు కలిపి దేశంలో 2 వేల ఎమ్మెల్యే స్థానాలు కూడా లేవని, మిగితా స్థానాలు ప్రాంతీయ పార్టీల చేతిలో ఉన్నాయని చెప్పారు. అయినా కూడా తామే ప్రతిపక్ష పార్టీలకు నేతృ త్వం వహిస్తామని కాంగ్రెస్ అంటోందని సెటైర్ వేశారు. జాతీయ మీడియా సంస్థ NDTV కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాంగ్రెస్ అహంకారాన్ని వీడాలి

వివక్షాలపై కూర్చొని పని చేయాలని కాంగ్రెస్ భావిస్తే.. ఆ పార్టీ అహంకారాన్ని వదిలిపెట్టాలని, వాస్తవాలను గ్రహించాలని, దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రతిపక్షాలకు ఎలా నేతృత్వం వహిస్తుందని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు వారిని ఆహ్వానించలేదని చెప్పారు. ఏప్రిల్ 14న జరిగే సభకు మమతా-బెనర్జీకి ఆహ్వానం వెళ్లిందో లేదో తనకు తెలియదని, కానీ మమతతో మాత్రం విబేధాలు ఏమీ లేవని, ఒకసారి కేసీఆర్ కూడా వెళ్లి కలిశారని చెప్పారు. యూపీఏ కూటమిలో ఉన్న చాలా పార్టీలకు కేవలం రెండు, మూడు ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయని, పెద్ద పార్టీల్లో డీఎంకే తప్ప మిగతా ఇతర పార్టీలు యూపీఏలో లేవని చెప్పారు. ప్రతిపక్షాల ఉమ్మడి లక్ష్యం ఏంటి..? అనేదే ప్రధానమైన అంశమని స్పష్టం చేశారు.

బీజేపీని గద్దె దించుతాం

దేశాన్ని సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయని, అయినా కూడా ఇంటింటికి తాగునీరు, విద్యుత్తును అందించలేకపోయాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశం ఈ పరిస్థితిలో ఉండడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని ఆరోపించారు. దేశానికి మంచి జరగాలంటే ఆ రెండు పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయం రావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, కేరళలో పినరయి విజయన్, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనుల వల్ల మార్పు కనిపిస్తోందని పేర్కొన్నారు. దేశం మారుతుందని 2014లో మోడీ ప్రధాని అయినప్పుడు అంతా భావించారని, కానీ దేశం ఏం మారిందని ప్రశ్నించారు. కీలకమైన హామీలను అమలు చేయలేదని, ఉద్యోగాలు కల్పించలేదని, నల్లధనాన్ని విదేశాల నుంచి వెనక్కి తీసుకురాలేదని, రూపాయి విలువ పడిపోవడాన్ని కట్టడి చేయలేదని పేర్కొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఎందుకు జారీ చేయడం లేదని అడిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోనే సమస్య అని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని కాంగ్రెస్.. ఎదుర్కొంటుందా లేదా అని ఆ పార్టీ ఆలోచించుకోవాలని, బీజేపీని గద్దె దించాలన్న ఉద్దేశముంటే దాన్ని ఎదుర్కొలేని పరిస్థితుల్లో, తక్కువ సీట్లు వచ్చే అవకాశమున్న చోట క్షేత్రస్థాయిలో అందరితో కలిసి పనిచేయాలని చెప్పారు. బీజేపీని గద్దె దించకపోతే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. విపక్షాలందరమూ కలిసి బీజేపీని గద్దె దించుతామని చెప్పారు. 

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అరెస్టుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తోందని, కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు విపక్షాలు అన్నీ కలిసిరావాలని, కాంగ్రెస్ కలిసి రాకున్నా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలకు బలం ఉందని తెలిపారు.

హామీల అమలులో మోడీ విఫలం

కాంగ్రెస్ ప్లీనరీ ముందు ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో ఈడీ దాడులు జరిగాయని, విపక్షాలు సమావేశాలు పెట్టుకున్నా కూడా భయపడుతున్నారంటే దేశం ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మద్దతు వస్తోందని బీజేపీ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. తాను తినను తిననివ్వడని ప్రధాని మోడీ చెబుతుండేవారని, కానీ జనవరి 25న హిండెన్స్ బర్గ్ రిపోర్టు తర్వాత కొంతమందిని కాపాడడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. మోడీకి ఉన్న అవినీతిరహిత ఇమేజ్ ఇప్పుడు లేదన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారని, వాటిని అమలు చేయడంలో ఆయన విఫలమయ్యారని విమర్శించారు.

అదానీపై చర్యలు తీసుకోవాలె

ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకొని భయపెట్టాలని చూస్తే సమస్య లేదని, అదే సమయంలో అదానీపై కూడా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. అధికారంలో ఉన్న వ్యక్తి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. తాము దర్యాప్తు సంస్థలను స్వాగతిస్తున్నామని, అదానీ ఎందుకు స్వాగతించడం లేదని అడిగారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిదికాదన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోడీ వెళ్లే ముందే ఈడీ వెళ్తుందని అందరికీ తెలుసన్నారు. సీబీఐ, ఈడీ ఎన్నికల సంఘం, ఐబీ, పోలీసు వంటి సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని అనుకోవడానికి లేదని, ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. 

దూసుకెళ్తున్న తెలంగాణ 

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దేశానికి మంచి చేయాలని తాము ముందుకొస్తే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. 2014కు ముందు ప్రధాని మోడీ చెప్పిన గుజరాత్ మోడల్ కు, ఇప్పుడు తెలంగాణ మోడల్ మొత్తం వేరు వేరని , గుజరాత్ కంటే తెలంగాణ మోడల్ ఉత్తమమైనదని, ఫలితాలు కళ్లముందు ఉన్నాయని వివరించారు.