ఎమ్మెల్సీ కవితకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

ఎమ్మెల్సీ కవితకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
  • ఈడీ నోటీసులపై స్టే ఇవ్వలేం 
  • కవితకు తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు
  • పిటిషన్​పై అత్యవసర విచారణకూ నో
  • స్టే కోసం సుప్రీంను ఆశ్రయించిన కవిత
  • తన ఇంట్లో కానీ, వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కానీ ఈడీ విచారణ జరపాలని అప్పీల్​
  • 24న  విచారణ చేపడ్తామన్న సీజేఐ బెంచ్​

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్​ స్కామ్​ కేసులో గురువారం తమ ఎదుట హాజరుకావాలన్న ఈడీ నోటీసులపై స్టే కోసం ఆమె పిటిషన్​ వేయగా.. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్​ నిరాకరించింది. అత్యవసరంగా ఈ పిటిషన్​ను విచారించలేమని తేల్చిచెప్పింది. కేసు దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో గురువారం కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకానున్నారు. 

నా ఫోన్ బలవంతంగా తీసుకున్నరు: కవిత

సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కాపీలో కవిత పలు అంశాలు ప్రస్తావించారు. ‘‘నేను కేసీఆర్ కూతుర్ని. గతంలో ఎంపీగా, ప్రస్తుతం నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ గా ఉన్న. గతంలో ఎంపీగా వివిధ పార్లమెంట్ కమిటీల్లో ఉన్న. అలాంటి నన్ను కేంద్రంలోని అధికార పార్టీ ఆదేశాల మేరకు ఈడీ  వేధిస్తున్నది. ఈనెల 11న జరిగిన విచారణ టైంఓ నా ఫోన్​ బలవంతంగా ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఫోన్ సీజ్ చేసిన టైంలోనూ వివరణ తీసుకోలేదు. ఎందుకు ఫోన్ తీసుకున్నారో చెప్పలేదు. రాత్రి 8.30 గంటల వరకు విచారించారు. భౌతికంగా, మానసికంగా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగించారు” అని ఆమె పేర్కొన్నారు. కేసులో విచారణను తన నివా సంలో కానీ, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ జరిపేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదే కేసుకు సంబంధించి సీబీఐ నిరుడు డిసెంబర్ 11న హైదరాబాద్ లోని తన నివాసంలో దాదాపు ఏడు గంటలు విచారణ జరిపిందని తెలి పారు. విచారణ సందర్భంలో ఈడీ థర్డ్ డిగ్రీ, బలవంతపు వ్యూహాలను అవలంబిస్తున్నదని కవిత పిటిషన్​లో పేర్కొన్నారు. ఇందుకు లిక్కర్​ స్కామ్​ కేసులో సాక్షి చందన్ రెడ్డితో ఈడీ అధికారులు ప్రవర్తించిన విధానమే నిదర్శనమన్నారు. తన విషయంలోనూ ఈడీ చట్ట విరుద్ధంగా వ్యవహరిం చిందని కవిత ఆరోపించారు. కేసు ఎఫ్ ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని, కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలం  ఆధారంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు. ‘‘అరుణ్ రామచంద్ర పిళ్లైని బెదిరించి స్టేట్​మెంట్​ తీసుకున్నరు. ఇటీవల స్టేట్​మెంట్​ను ఆయన వెనక్కి తీసుకోవడమే ఇందుకు సాక్ష్యం. అలాంటి  స్టేట్​మెంట్లకు విశ్వసనీయత లేదు. వాటి ఆధా రంగా నన్ను విచారణకు పిలుస్తున్నరు” అని కవిత తెలిపారు.

105 పేజీల పిటిషన్​

ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కల్వకుంట్ల కవిత తరఫున అడ్వకేట్ వందన సెఘల్ మంగళవారం 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు. తనపై ఎలాంటి బలవంతపు (అరెస్ట్ లాంటి) చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​లో కవిత కోరారు. ఈ అంశాన్ని ఆమె తరఫున అడ్వకేట్​ బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ వై చంద్రచూడ్ బెంచ్ ముందు ప్రస్తావించారు. పిటిషన్​పై అత్యవసరంగా విచారణ జరపాలని  బెంచ్ ను కోరారు. ఈడీ సమన్ల విషయంలో తమకు ఉపశమనం రావాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఆర్పీసీ ప్రకారం.. ఆడవాళ్లను ఆఫీసుకు పిలిచి విచారించొద్దని సుప్రీంకోర్టు గతంలో పలు కేసుల్లో మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. అయితే.. అందుకు భిన్నంగా ఈడీ వ్యవహరిస్తున్నదని అన్నారు. ‘‘ఇది వరకే ఒకసారి కవితను ఈడీ విచారణకు పిలిచింది. మరో సారి (గురువారం) విచారణకు పిలిచింది. దీనిపై స్టే ఇవ్వాలి” అని కోరారు. పిటిషన్​పై అత్యవసర విచారణకు సీజేఐ ధర్మాసనం ఒప్పుకోలేదు. ఈడీ నోటిసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పిటిషన్​పై  మార్చి  24 న విచారణ చేపడతామని ప్రకటించింది.