
- బీఆర్ఎస్ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకలనిర్వహణ!
- దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో ప్రకటనల కోసం ఏర్పాట్లు
- వేడుకలకు రూ. 200 కోట్ల దాకా ఖర్చు.. అందులో యాడ్స్కే రూ. 50 కోట్లు!
హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ ఇయర్ కావడంతో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని నిర్ణయించింది. సర్కారు సొమ్ముతో నిర్వహించే ఈ వేడుకల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ను ప్రమోట్చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా వేడుకల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా యాడ్స్ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రమోట్ అయ్యేలా ప్రకటనలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం దాదాపు రూ. 200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పెషల్ స్పీచ్ కాపీలు
వేడుకల్లో ప్రతిచోటా బీఆర్ఎస్ పార్టీకి పేరు వచ్చేట్లు చూడాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. మంత్రులు, బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు ఉండాలని అధికారులకు కూడా చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల స్పీచ్ల్లోనూ ‘రాష్ట్ర ప్రభుత్వం’ బదులు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం’ అని వచ్చేలా చూస్తున్నారు. ఇందుకోసం స్పెషల్గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పీచ్ కాపీలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 33 జిల్లాలకు కనీసం రూ.3 కోట్ల చొప్పున ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో మస్తు యాడ్స్!
రాష్ట్ర అవతరణ దినోత్సవం, వేడుకల అడ్వర్టయిజ్ మెంట్ల కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనలన్నింటిలో అధికార పార్టీ ప్రతిబింబించేలా డిజైన్లు చేస్తున్నారు. నేషనల్ మీడియా చానళ్లు, పేపర్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన న్యూస్ పేపర్లకు అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అవతరణ వేడుకల అడ్వర్టయిజ్మెంట్ల కోసమే రూ. 50 కోట్ల పైన ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్లో ఐ అండ్ పీఆర్కు ప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అందులో నుంచే అవతరణ వేడుకల యాడ్స్ కోసం ఖర్చు చేయనున్నారు. ‘తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రగతి పుస్తకం..దేశానికి ఆదర్శం’ పేరుతో స్పెషల్గా ప్రకటనలు, వీడియోలు కూడా రెడీ చేస్తున్నారు.
తొమ్మిదేండ్లలో చేయాల్సిన ఖర్చు కంటే ఎక్కువే!
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అయితే ఎప్పుడు కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను భారీగా చేయలేదు. అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఆ ఒక్క రోజు ఏదో హడావుడి చేసి ముగించేవారు. అయితే ఈసారి మాత్రం 21 రోజులపాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈసారి చేసే ఖర్చు 9 ఏండ్లలో చేయాల్సిన మొత్తం ఖర్చు కంటే పదింతలు ఎక్కువే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో పాటు జిల్లాల్లో కలెక్టర్లకు నిధుల రిలీజ్ చేయనున్నారు.