ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం.. రెడీ అవుతున్న ప్రత్యేక యాడ్స్

ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ప్రచారం.. రెడీ అవుతున్న ప్రత్యేక యాడ్స్
  • బీఆర్​ఎస్​ను ప్రమోట్ చేసుకునేలా అవతరణ వేడుకలనిర్వహణ!
  • దేశవ్యాప్తంగా అన్ని మీడియాల్లో ప్రకటనల కోసం ఏర్పాట్లు
  • వేడుకలకు రూ. 200 కోట్ల దాకా ఖర్చు.. అందులో యాడ్స్​కే రూ. 50 కోట్లు!

హైదరాబాద్​, వెలుగు: ఎలక్షన్​ ఇయర్​ కావడంతో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని నిర్ణయించింది. సర్కారు సొమ్ముతో నిర్వహించే ఈ వేడుకల్లో అధికార పార్టీ బీఆర్​ఎస్​ను ప్రమోట్​చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా వేడుకల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లోనూ భారీగా యాడ్స్​ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రమోట్ అయ్యేలా ప్రకటనలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం దాదాపు రూ. 200 కోట్ల వరకు  ఖర్చు చేయనున్నట్లు సమాచారం. 

మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పెషల్​ స్పీచ్​ కాపీలు

వేడుకల్లో ప్రతిచోటా బీఆర్​ఎస్​ పార్టీకి పేరు వచ్చేట్లు చూడాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. మంత్రులు, బీఆర్​ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పినట్లుగానే రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు ఉండాలని అధికారులకు కూడా చెప్పినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల స్పీచ్​ల్లోనూ ‘రాష్ట్ర ప్రభుత్వం’ బదులు.. ‘బీఆర్​ఎస్​ ప్రభుత్వం’ అని వచ్చేలా చూస్తున్నారు. ఇందుకోసం స్పెషల్​గా మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్పీచ్​ కాపీలు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం 33 జిల్లాలకు కనీసం రూ.3 కోట్ల చొప్పున ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అయితే ఈ మొత్తం మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. 

ఇతర రాష్ట్రాల్లో మస్తు యాడ్స్​!

రాష్ట్ర అవతరణ దినోత్సవం, వేడుకల అడ్వర్టయిజ్​ మెంట్ల కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకటనలన్నింటిలో అధికార పార్టీ  ప్రతిబింబించేలా డిజైన్లు చేస్తున్నారు. నేషనల్​ మీడియా చానళ్లు, పేపర్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన న్యూస్​ పేపర్లకు అడ్వర్టయిజ్​మెంట్లు ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఐ అండ్​ పీఆర్​ డిపార్ట్​మెంట్​కు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అవతరణ వేడుకల అడ్వర్టయిజ్​మెంట్ల కోసమే రూ. 50 కోట్ల పైన ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఈసారి బడ్జెట్​లో ఐ అండ్​ పీఆర్​కు ప్రభుత్వం  రూ.1,000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అందులో నుంచే అవతరణ వేడుకల యాడ్స్​  కోసం ఖర్చు చేయనున్నారు. ‘తొమ్మిదేండ్ల తెలంగాణ ప్రగతి పుస్తకం..దేశానికి ఆదర్శం’ పేరుతో స్పెషల్​గా ప్రకటనలు, వీడియోలు కూడా రెడీ చేస్తున్నారు. 

తొమ్మిదేండ్లలో చేయాల్సిన ఖర్చు కంటే ఎక్కువే!

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి బీఆర్​ఎస్​ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. అయితే ఎప్పుడు కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను భారీగా చేయలేదు. అవతరణ దినోత్సవమైన జూన్​ 2న ఆ ఒక్క రోజు ఏదో హడావుడి చేసి  ముగించేవారు. అయితే ఈసారి మాత్రం 21 రోజులపాటు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈసారి చేసే ఖర్చు  9 ఏండ్లలో చేయాల్సిన  మొత్తం ఖర్చు కంటే పదింతలు ఎక్కువే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్​లో ఉన్న ప్రతి హెడ్​ ఆఫ్​ ది డిపార్ట్​మెంట్​, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో పాటు జిల్లాల్లో కలెక్టర్లకు నిధుల రిలీజ్​ చేయనున్నారు.