కడియం టార్గెట్‌గా బీఆర్ఎస్​ పాలిటిక్స్

కడియం టార్గెట్‌గా బీఆర్ఎస్​ పాలిటిక్స్
  •     బీజేపీకి తెర వెనుక సపోర్ట్​ చేస్తోందనే ఆరోపణలు
  •     అందుకే క్యాడర్​ లేని సుధీర్​ కుమార్​ను ఎంపిక చేశారనే చర్చ
  •     రాజయ్యకు టికెట్​ ఇవ్వక పోవడానికి కారణం అదేనా?
  •     వరంగల్​లో ఆసక్తికర రాజకీయాలు

హనుమకొండ, వెలుగు : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కడియం శ్రీహరిని దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ తెరవెనుక పాలిటిక్స్​ చేస్తోందా?  ఇందులో భాగంగా పెద్దగా పేరు లేని అభ్యర్థిని రంగంలోకి దింపి బీజేపీకి మేలు చేసేలా వ్యూహం రచించిందా అంటే అన్ని పార్టీల క్యాడర్​ నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. పార్టీ నుంచి కడియం శ్రీహరి బయటకు వెళ్లిన తర్వాత పార్లమెంట్​నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయాడు. తమ పార్టీ నుంచి కడియం కూతురుకు టికెట్​ఇచ్చిన తర్వాత కూడా బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరడంతో గులాబీ అధినాయకత్వం శ్రీహరిపై గుర్రుగా ఉంది. అంతకుముందే అరూరి రమేశ్​పార్టీ వీడినా లైట్​తీసుకున్న ఆ పార్టీ లీడర్లు ఎందుకో కడియం విషయంలో మాత్రం సీరియస్​గా తీసుకున్నారు. ఎలాగైనా కావ్యను ఓడగొట్టాలన్న లక్ష్యంతో తెరవెనుక బీజేపీకి సపోర్ట్​చేసేలా వ్యూహాలు రచిస్తున్నారనే చర్చ సాగుతోంది.  

కడియమే టార్గెట్..స్పష్టం చేసిన హరీశ్​  

వరంగల్ పార్లమెంట్​నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్​కాగా మొదట బీఆర్ఎస్​టికెట్​ను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్​ఆశించారు. కానీ, ఫీల్డ్​లెవెల్​లో బీఆర్ఎస్​కు పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించి బీజేపీలో చేరారు. కేసీఆర్​వరంగల్​లో కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్​ఇవ్వగా ..వారు మాత్రం ఆ పార్టీకి రిజైన్​చేసి కాంగ్రెస్​లో చేరి టికెట్​తెచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అప్పటినుంచి శ్రీహరి, కావ్యను టార్గెట్​చేసి విమర్శిస్తున్నారు.

కడియం రాజీనామా తర్వాత చింతగట్టులో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ కడియం పార్టీ నుంచి వెళ్లిన తర్వాతే పార్టీలో జోష్​ కనిపిస్తోందని, పార్టీకి ద్రోహం చేసిన కడియంను ఓడగొట్టాలనే కసి కనపడుతోందన్నారు. టికెట్ఇచ్చిన తర్వాత కూడా ద్రోహం చేసిన వాళ్లకు గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేసిన హరీశ్​ రావు.. ఇక్కడి క్యాండిడేట్​అరూరి రమేశ్​పై పెద్దగా మాట్లాడలేదు.  

ప్రచారంలో బీఆర్ఎస్​డీలా  

బీజేపీ అభ్యర్థిగా అరూరి రమేశ్, కాంగ్రెస్​క్యాండిడేట్​గా కావ్యను ఆ పార్టీ అధిష్ఠానాలు ప్రకటించడంతో ఆ ఇద్దరూ రోజువారీ సమావేశాలతో క్యాడర్​కు దగ్గరవుతున్నారు. కానీ, బీఆర్ఎస్​మాత్రం కడియం బయటకు వెళ్లిన తర్వాత15 రోజులదాకా అభ్యర్థిని ప్రకటించలేదు. గత శుక్రవారం తర్వాత తమ ఎంపీ అభ్యర్థిగా, హనుమకొండ జడ్పీ చైర్మన్​డాక్టర్​మారపెల్లి సుధీర్ కుమార్​ను ప్రకటించారు.  సరైన క్యాడర్​ లేని సుధీర్​కుమార్​ను అభ్యర్థిగా ప్రకటించారని ఫీల్డ్​లెవెల్​లో ఆ పార్టీ లీడర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆ పార్టీ ప్రచారం కూడా మొదలు పెట్టలేదు. ఇదంతా బీజేపీకి మేలు చేసేందుకేననే ప్రచారం జరుగుతోంది.  

సుధీర్​..ప్రభావం చూపే స్థితిలో లేరని..

వరంగల్ పార్లమెంట్​లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కడియంతో కలిపి అందరూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉన్నారు. అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్​భావిస్తుండగా..కడియంను ఓడగొట్టేందుకు బీఆర్ఎస్​ అధినేత అవకాశమున్నంత వరకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్​లీడర్లు  అంతర్గతంగా అరూరికి సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్​లో ఉన్నన్ని రోజులు ఆరూరి రమేశ్​కు మాజీ మంత్రి ఎర్రబెల్లి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్​భాస్కర్, ధర్మారెడ్డి, వెంకటరమణారెడ్డి, నరేందర్​తో సత్సంబంధాలే ఉన్నాయి. కానీ, పదవుల విషయంలో వాళ్లంతా కడియంపై గుర్రుగానే ఉన్నారు. దీంతో ఇప్పుడు కడియంను ఓడగొట్టేందుకు బీఆర్ఎస్​ నేతలంతా ప్రయత్నిస్తున్నారనే టాక్​ నడుస్తోంది. సుధీర్​కుమార్​ ప్రభావం చూపే స్థితిలో లేకపోవడంతో ఆరూరికి ఇంటర్నల్​గా మద్దతు తెలిపే అవకాశం ఉందంటున్నారు. 

రాజయ్యను బరిలో లేకుండా చేసింది అందుకేనా?  

బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, బీఆర్ఎస్​అభ్యర్థి సుధీర్​కుమార్​ఇద్దరూ మాదిగ సామాజికవర్గానికి చెందిన వారే.  బీఆర్ఎస్​నుంచి అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నేత రాజయ్య పోటీ చేస్తే ఓట్లు చీలి కాంగ్రెస్​తద్వారా కడియం లాభపడతారనే భావనతోనే రాజయ్యను పోటీలో లేకుండా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీకి ఫేవర్​చేసే వ్యూహంలో భాగంగానే సరైన క్యాడర్​ లేని సుధీర్​కుమార్​ ను రంగంలోకి దించారని అంటున్నారు. రాజయ్యకు, కడియంకు మధ్య ఎప్పటినుంచో వైరం ఉండగా.. కడియంపై పగ తీర్చుకునేందుకే పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజయ్యను బీఆర్ఎస్​మళ్లీ దగ్గరకు తీసినట్లు తెలుస్తోంది.

కేసీఆర్​కాళ్లు మొక్కినా పార్టీ వీడిన వాళ్లను మళ్లీ చేర్చుకోమన్న కేటీఆర్​.. కడియంను దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే రాజయ్యను మళ్లీ దగ్గరకు తీశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఖరారు కావడంతో ఓరుగల్లు రాజకీయం వేడెక్కగా.. కడియంను దెబ్బకొట్టేందుకు బీఆర్​ఎస్​ అమలు చేస్తున్న వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.