కరీంనగర్ టౌన్/గంగాధర, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ సిటీలోని తెలంగాణ చౌక్లో ఆందోళన చేశారు. 100 ఫీట్ల భారీ ఫ్లెక్సీతో నిరసన చేపట్టారు. ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఫ్లెక్సీని ఆటోలో తరలించి, బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సంజయ్ కేంద్రమంత్రిగా కొనసాగితే ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగదని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, లీడర్లు శ్రీకాంత్, రమణారావు పాల్గొన్నారు. గంగాధర మండలం మధురానగర్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు.
