- దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపణ
- ఆ వ్యవహారంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని అమిత్ షాకు లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విచారణ సంస్థలు, పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా దివాలా తీసిన రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్కు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
ఆ సంస్థ కేసుల విచారణకు సంబంధించి.. సీఎం ఆదేశాల మేరకు సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు. విచారణలో సేకరించిన కీలక సాక్ష్యాలు పోయాయని అధికారులు కోర్టుకు చెప్పడం అత్యంత దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, దర్యాప్తు విభాగాలపై ఉన్న ఒత్తిడికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
దివాలా ప్రక్రియ కొనసాగుతున్న కంపెనీకి రూ.2500 కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించినట్టు పలు నివేదికలు చెబుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సరఫరా పనులు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు వంటి అనేక కీలక ప్రభుత్వ ప్రాజెక్టులను ఈ కంపెనీకి అప్పగించారని చెప్పారు.
కంపెనీకి సంబంధించిన దివాలా ప్రక్రియ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు విచారణలో ఉండగానే.. విచారణను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ మెంబర్ జస్టిస్ శరద్ కుమార్ నిరుడు ఆగస్టు 13న కేసు విచారణ నుంచి తప్పుకున్నారన్నారు. 2022లో కేఎల్ఎస్ఆర్ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించిన ఏఎస్ మెట్ కార్ప్ సంస్థపై ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందన్నారు.
అందులో భాగంగానే కేన్సర్తో బాధపడుతున్న 75 ఏండ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ 18267/2025పై విచారణ జరుగుతున్నప్పుడు.. సాక్ష్యాధారాలుగా స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు అధికారుల కస్టడీ నుంచి కనిపించకుండా పోయాయని ఆరోపించారు. దీనిపై చీఫ్ జస్టిస్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు.
ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీలో జరిగిన అగ్నిప్రమాదం కూడా సాక్ష్యాధారాల భద్రతపై అనుమానాలను మరింత పెంచిందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేఎల్ఎస్ఆర్ కంపెనీపై ఉన్న ఆర్థిక ఆరోపణలు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అక్రమాలు, మనీ లాండరింగ్పై సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) వంటి కేంద్ర సంస్థలతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని అమిత్ షాను కోరారు. కాగా, ఈ లేఖను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘవాల్కూ పంపారు.
