- బీఆర్ఎస్ ఆదాయం ఏడాదిలో479 శాతం పెరిగింది
- 2020--21లో రూ.37 కోట్లు.. 2021--22లో రూ.218 కోట్లు
- అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఒక్క ఏడాదిలోనే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదాయం 479.19 శాతం పెరిగింది. వార్షికాదాయం ఎక్కువొస్తున్న రీజనల్పార్టీల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 2021–22 సంవత్సరానికిగాను దేశంలోని 36 రీజనల్ పార్టీలకు సంబంధించిన ఆదాయ వ్యయాలపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ఇటీవల ఓ రిపోర్ట్ రిలీజ్చేసింది. దాని ప్రకారం రూ.318.745 కోట్లతో తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ మొదటి స్థానంలో ఉండగా, రూ.307.288 కోట్లతో ఒడిశాలోని అధికార బీజేడీ పార్టీ రెండో స్థానంలో ఉంది. రూ.218.112 కోట్ల ఆదాయం కలిగిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. బీఆర్ఎస్ రాబడి ఒక్క ఏడాదిలోనే గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.180.454 కోట్లు పెరిగింది. 2020–21లో పార్టీ ఇన్కమ్ కేవలం రూ.37.658 కోట్లే. ఆదాయం పెరుగుదలలో బీజేడీ (రూ.233.941 కోట్లు పెరుగుదల) తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ఉండడం గమనార్హం. ఆదాయం అంతొస్తున్నా పార్టీ పెడ్తున్న ఖర్చు మాత్రం తక్కువే ఉంది. 2021–22లో బీఆర్ఎస్ పెట్టిన ఖర్చు కేవలం రూ.27.939 కోట్లే. అదిపోను పార్టీ దగ్గర మిగిలిన డబ్బు రూ190.173 కోట్లు.
ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే ఎక్కువ
పార్టీకి వచ్చిన ఆదాయంలో ఎక్కువ మొత్తం ఎలక్టోరల్ బాండ్ల విరాళాల రూపంలోనే వచ్చింది. గ్రాంట్లు, డొనేషన్లు, ఎలక్టోరల్బాండ్ల రూపంలో రూ.193.9375 కోట్లు రాగా.. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.153 కోట్లు సమకూరాయి. ఈ విషయంలోనూ బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంది. తర్వాత బ్యాంకుల్లోని డిపాజిట్ల మీద వడ్డీ ద్వారా రూ.16.1271 కోట్లు, ఫీజులు, సబ్స్క్రిప్షన్ల ద్వారా మరో రూ.8.0474 కోట్ల మేర ఆదాయం సమకూరింది. పార్టీ వ్యయంలో అత్యధికంగా రూ.19.77 కోట్లు పార్టీ నిర్వహణ కోసమే ఖర్చు చేసినట్టు ఏడీఆర్తన రిపోర్ట్లో పేర్కొంది. మరో రూ.7.68 కోట్లు మాత్రమే ఎన్నికల కోసం ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
ఎక్కువ కేసులున్నది కేసీఆర్పైనే
ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ కేసులున్న సీఎంల జాబితాలో కేసీఆరే ముందున్నారు. ఆయన మీద 64 కేసులుండగా.. 37 తీవ్రమైన సెక్షన్లు, 283 ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఒక్క కేసులోనూ కన్విక్షన్ జరగలేదు. ఈ లిస్ట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (47 కేసులు) రెండో స్థానంలో, ఏపీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి (38 కేసులు) మూడో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆస్తులు ఎక్కువగా ఉన్న సీఎంలలో కేసీఆర్ ఆరోస్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ కేవలం రూ.23.55 కోట్లేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. అయితే, అప్పులు ఎక్కువగా ఉన్న సీఎంలలోనూ సీఎం కేసీఆరే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కేసీఆర్కు రూ.8.88 కోట్ల అప్పులున్నట్టు ఏడీఆర్ రిపోర్ట్పేర్కొన్నది.
