
- వివాహేతర సంబంధం పెట్టుకుందని వివస్త్రను చేసి కొట్టిన్రు
- 22న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ, పురుషుడిపై అతని భార్య తరఫు బంధువులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మహిళను చెట్టుకు కట్టేసి, వివస్త్రను చేసి చెప్పులతో కొట్టారు. ఇద్దరికీ అర గుండు గీసి, ఫోన్ లో వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. గాయాల పాలైన ఆమెను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ నెల 22న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాటికాయల గ్రామానికి చెందిన గంగకు 23 ఏండ్ల కిందట వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన చిక్కుడు రాజుతో పెండ్లి జరిగింది. దాదాపు ఆరేండ్ల నుంచి రాజు బొల్లోనిపల్లిలోనే ఉండే తమ దగ్గరి బంధువైన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యాపిల్లలను పట్టించుకోకుండా అదే గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆ మహిళతో సహజీవనం చేస్తున్నారు.
ఈ నెల 22న గంగ తల్లి, ఇద్దరు అన్నదమ్ములు బొల్లోనిపల్లికి వెళ్లి రాజు, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తాటికాయల గ్రామంలోని గంగ అన్నదమ్ముల ఇంటికి తీసుకొచ్చి మహిళపై అమానుషంగా దాడిచేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన మహిళను చిన్నపెండ్యాల వద్ద రోడ్డుపై వదిలేసినట్టు తెలిసింది. రాజును మాత్రం తమ వద్దే ఉంచుకోగా.. ఆయన కూడా తెల్లారి లేచిచూసేసరికి అదృశ్యమయ్యాడు. తీవ్ర గాయాలైన వాళ్లిద్దరూ ఏమైపోయారనేది మిస్టరీగా మారింది.
12 మందిపై కేసు?
ఘటనకు సంబంధించిన వీడియోలో శనివారం సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో కాజీపేట ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ ప్రవీణ్ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. తాటికాయల గ్రామానికి వెళ్లి వాళ్లిద్దరిపై దాడి చేసిన గంగ కుటుంబ సభ్యులను స్టేషన్ కు తరలించి విచారణ జరిపారు.
బాధితుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఏసీపీ తెలిపారు. బాధితులు కంప్లైంట్ ఇవ్వనిపక్షంలో సుమోటోగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా గంగ బంధువులు 12 మందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీస్ సిబ్బంది తెలిపారు.
అలాగే, ఈ ఘటనపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి జె.జయంతి తదితరులు శనివారం మధ్యాహ్నం తాటికాయల గ్రామంలో విచారణ చేపట్టారు. జీపీ సెక్రటరీ మురాల చామంతితో పాటు గ్రామ పెద్దలతో మాట్లాడి వివరాలు సేకరించారు.