మియాపూర్లో బస్సు మిస్సైతే ఛేజింగ్ చేసి మూసాపేట్లో ఎక్కాడు.. గాయాలతో బయట పడిన బీటెక్ స్టూడెంట్

మియాపూర్లో బస్సు మిస్సైతే ఛేజింగ్ చేసి మూసాపేట్లో ఎక్కాడు.. గాయాలతో బయట పడిన బీటెక్ స్టూడెంట్

దివాళి పండుగకు వచ్చి వెళ్తున్న వారు కొందరు.. ఉద్యోగాలకు వెళ్తున్న వారు కొందరు.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ. కొందరు నిద్రలోనే కనుమూస్తే.. కొందరు చివరి శ్వాస వరకూ పోరాడి చనిపోయారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం అంతా ఇంతా కాదు. 19 మంది ప్రయాణికులు మృతి చెందిన ఈ ప్రమాదంలో కొందరు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు

శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారు జామున జరిగిన బస్సు ప్రమాదంలో ఓ బీటెక్ స్టూడెంట్ గాయాలతో బతికి బయటపడ్డాడు. హైదరాబాద్ మియాపూర్ లో నివాసం ఉండే జయసూర్య (23) అనే స్టూడెంట్ ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తను బుక్ చేసుకున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మియాపూర్ లో మిస్సైంది. దీంతో ఛేజింగ్ చేసి మరీ మూసాపేట్ లో బస్సు ఎక్కాడు. ఉద్యోగం కోసం గంపెడాశలతో వెళ్తున్న స్టూడెంట్.. చివరికి ప్రమాదానికి గురయ్యాడు. ఎట్టకేలకు బతికి బయటపడ్డాడనే వార్త విని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

కడప జిల్లా జమ్మలమడుగు మండలం నెమలి దిమ్మె గ్రామానికి చెందిన జయసూర్య.. తల్లి తండ్రులు రమా దేవి, సుబ్బారాయుడు తో కలిసి మియాపూర్ మక్త మహబూబ్ పేట్ లోని ప్రజా షెల్టర్ అపారెంట్ లో ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ పూర్తిచేసిన జయసూర్య.. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉందంటూ గురువారం (అక్టోబర్ 23) సాయంత్రం ఇంట్లో నుండి బయలుదేరాడు. 

జయసూర్య వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైన వార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గరయ్యారు. తమ కొడుకు ఆచూకీ కోసం టెన్షన్ పడుతున్న సమయంలో.. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాడు జయసూర్య. తను క్షేమంగానే ఉన్నానని.. బస్సు ప్రమాదంలో తన రెండు కాళ్లకు గాయాలు అవ్వడంతో కర్నూల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేరెంట్స్ కు చెప్పాడు.  
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎటువంటి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాడు. 

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నుంచి ఎలా బయట పడ్డాడో ఫోన్ ఫోన్ లో వివరించాడు. ప్రమాద సమయంలో బస్సును పూర్తిగా మంటలు ఆవరించడంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ పగలగొట్టి బయటకు దూకినట్లు చెప్పాడు. బస్సును పూర్తిగా పొగ, మంటలు కమ్మేయడంతో.. బయటకు దూకినట్లు చెప్పాడు. దీంతో రెండు కాళ్లకు గాయాలయ్యాయని.. ఆస్పత్రితో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు జయసూర్య.