మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయి: మంత్రి వివేక్

మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయి: మంత్రి వివేక్

హైదరాబాద్: మనిషి సాధారణ జీవితాన్ని గడిపేందుకు బుద్ధుని బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని  రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం (మార్చి 2) నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధ వనంలో మూడవ బుద్ధ ధమ్మ యాత్ర ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. శాంతియుతంగా, ఆశావాద దృక్పథంతో జీవితాన్ని కొనసాగించేందుకు బుద్ధుని బోధనలు ఉపకరిస్తాయని తెలిపారు. బుద్ధవనాన్ని రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బుద్ధవనాన్ని టూరిజం మాన్యుమెంట్‎గా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బుద్ధవనాన్ని విశ్వశాంతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలైన కరుణ, ప్రేమ, దయ వంటి వాటిని ప్రజల హృదయాలలో తిరిగి నింపేందుకు కృషి చేస్తామన్నారు. బౌద్ధ బిక్షువులు నెలరోజుల పాటు కర్ణాటకలోని కాలబురిగి నుంచి తెలంగాణలోని బుద్ధ వనం వరకు నిర్వహించిన పాదయాత్ర అద్భుతమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. 

బుద్దవనాన్ని వరల్డ్ క్లాస్ హెరిటేజ్ కేంద్రంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి గ్లోబల్ బుద్ధిష్ట్ కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రభాథ్ భేరి పేరుతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.