- ఉన్నతాధికారి వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి సూసైడ్చేసుకోగా.. ఉన్నతాధికారి వేధింపులే కారణమని మృతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్కలెక్టరేట్లోని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయంలో వాడ్త్య శ్రీధర్ బాబు(39) ఔట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. భార్య సరోజ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడితో కలిసి తుర్కయంజాల్లోని శ్రీరాంనగర్కాలనీలో నివాసం ఉంటున్నాడు.
ఈ నెల 1న కూతురి కాలేజీ అడ్మిషన్ కోసం ఉన్నతాధికారి అనుమతితో త్వరగా ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అదే శాఖకు చెందిన లోన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు నుంచి శ్రీధర్బాబుకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వెంటనే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకున్నాడు.
కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు. లోన్ ఇన్స్పెక్టర్ పదేపదే ఫోన్చేస్తూ వేధించడం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య గురువారం ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
