మంత్రులకు ‘విస్తరణ’ టెన్షన్

మంత్రులకు ‘విస్తరణ’ టెన్షన్

హైదరాబాద్‌, వెలుగుమంత్రులకు కేబినెట్​ విస్తరణ గుబులు పట్టుకుంది. ఇప్పుడున్నవారిలో కొందరిపై వేటు పడనుందని టీఆర్‌ఎస్‌లో ప్రచారం జరుగుతుండటంతో.. ఎవరా కొందరన్న ఆందోళన నెలకొంది. లోక్​సభ రిజల్ట్స్​ తర్వాతే ఒకరిద్దరు మంత్రులపై వేటు పడే అవకాశముందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో సీఎం మంత్రివర్గ విస్తరణకు పూనుకోలేదు. ఎవరెవరిని తొలగించవచ్చంటూ అప్పుట్లో పేర్లు ప్రచారమైన మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా దసరాకు ముందే కేబినెట్​ విస్తరణ ఉండవచ్చన్న అంచనాలతో మంత్రుల్లో మళ్లీ టెన్షన్‌ మొదలైంది. దాంతో వారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వద్దకు క్యూ కడుతున్నారు.

ఊస్టింగ్​ ఎవరికి? చాన్స్ ఎవరికి?

రాష్ట్ర కేబినెట్​లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురికి పదవి ఇచ్చేందుకు వీలుంది. ప్రస్తుత కేబినెట్లో ఐదుగురు రెడ్లు, ఇద్దరు వెలమలు, ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక మైనార్టీ ఉన్నారు. గతంలో కేబినెట్‌ బెర్త్‌ ఇస్తానని నలుగురు రెడ్డి కుల నేతలకు కేసీఆర్​ గట్టి హామీ ఇచ్చారు. వారిలో ముగ్గురికి విస్తరణలో అవకాశం ఇస్తారని సమాచారం. ఇక బీసీల్లోని మున్నూరు కాపులకు చోటు ఇవ్వాల్సి ఉంది. ఎస్టీలకు ఇంకా చాన్స్​ రాలేదు. కమ్మ కులానికి కూడా ఒక బెర్త్‌ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇద్దరు మహిళలను కేబినెట్లోకి తీసుకుంటామని కేసీఆర్​ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెడ్డి కులానికి చెందిన ఓ మహిళా నేతకు కేబినెట్‌ బెర్త్‌ ఖాయమని తెలుస్తోంది. ఎస్టీల నుంచి మహిళా నేతకే అవకాశం దక్కవచ్చని ప్రచారం జరిగినా.. మెల్లగా ఆ మహిళా ప్రజాప్రతినిధి పేరును ప్రచారం నుంచి తప్పిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క మహిళకే అవకాశం దక్కుతుందని అంటున్నారు.

ఏయే జిల్లాల నుంచి..

హైదరాబాద్‌  నుంచి ఒకరు, ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కో రెడ్డి నేతకు కేబినెట్​లో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకే చెందిన మరో సీనియర్‌  నేత మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు కేటీఆర్‌ను కలిసి తనకు అవకాశం ఇప్పించాలని కోరారు. పెద్ద సార్‌కు చెప్తాననడం మినహా ఆయనకు గట్టి హామీ ఏదీ లభించలేదని సమాచారం. వాస్తవానికి ఒక సమయంలో ఈ నేత పేరు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉండగా.. ఇప్పుడు తెరమరుగమవుతోంది. అయితే ఖాళీగా ఉన్న ఆరు పదవుల్లో ముగ్గురు రెడ్లకు అవకాశమిస్తే కుల సమీకరణాలు దెబ్బతింటాయన్న అంచనాలున్నాయి. దాంతో కొత్త వాళ్లకు అవకాశం కల్పించేందుకు.. ఉన్నవారిలో ఇద్దరు ముగ్గురు మంత్రులపై వేటు తప్పదని తెలుస్తోంది.

కొందరు మంత్రుల ముందు జాగ్రత్త!

ఎవరెవరిపై వేటు పడొచ్చంటూ టీఆర్ఎస్​లో చర్చలు జరుగుతుండటంతో కొందరు మంత్రులు డిఫెన్స్​లో పడ్డారు. ఒక్కొక్కరుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను కలిసి మాట్లాడారని, తమను కొనసాగించాలని కోరారని సమాచారం. అయితే దీనిపై తాను కచ్చితంగా హామీ ఇవ్వలేనని, ముఖ్యమంత్రికి విషయం చెప్తానని కేటీఆర్‌ వారికి బదులిచ్చినట్టు సమాచారం. ఒకరిద్దరు మంత్రులు సీఎంను కలిసినా ఈ విషయమై అడిగే సాహసం చేయలేకపోయినట్టు తెలిసింది. పేర్లు ప్రచారంలో ఉన్న మంత్రుల్లో ఇద్దరిపై వేటు తప్పదని, ఒకరికి మాత్రం చివరి క్షణంలో వేటు నుంచి తప్పించుకునేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.

వారిలో మాత్రం జోష్

కేబినెట్‌లోకి వస్తారని ప్రచారంలో ఉన్న ఇద్దరు నేతల్లో మాత్రం ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. సీఎం వారికి గట్టి హామీ ఇవ్వడంతో తర్వాతి విస్తరణలో చోటు ఖాయమని తెలుస్తోంది. మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కమ్మ కులానికి చెందిన సీనియర్‌ నేతను కేబినెట్‌లో తీసుకోవడం ఖాయమని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి. మొదట కొందరి పేర్లు ప్రచారంలో ఉన్నా, ఆ కులాన్ని మేనేజ్‌ చేయడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావే బెటరని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్డి కులం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు చాన్స్​ రావొచ్చని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ముందే విస్తరణ ఉండొచ్చని ఒకవైపు.. కార్తీక మాసంలోనే విస్తరణ ఉంటుందని మరోవైపు ప్రచారం జరుగుతోంది.