
ఐపీఎల్ వేలంలో భారీ ధర పలకడం వల్ల తన ఆట ఏ మాత్రం మారదని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ అన్నాడు. ఇంత ధరకు తనను కొనుగోలు చేస్తారని అనుకోలేదన్నాడు. ఐపీఎల్లో ఆడాలని తన పేరును వేలంలో నమోదు చేసుకున్నానని.. అయితే ఇంత భారీ ధర పలకడంతో ఆశ్చర్యానికి గురైనట్లు గ్రీన్ చెప్పాడు.
ఆల్ రౌండర్లు సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాలంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుందని గ్రీన్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్లో సమానంగా రాణించడం చాలా కష్టమన్నాడు. ఏదో ఒక దాంట్లో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు. రెండు విభాగాల్లో రాణించాలని శ్రమిస్తే ఒత్తిడి పెరుగుతుందన్నాడు. అయితే తాను మాత్రం బ్యాటింగ్పైనే శ్రద్ధ పెడతానని వెల్లడించాడు. మ్యాచ్కు ముందు రోజు మాత్రమే బౌలింగ్పై దృష్టి పెడతానని చెప్పాడు.
కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ 2023 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. పొలార్డ్ ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతని స్థానానికి గ్రీన్ సరిగ్గా సరిపోతాడని భావించిన ముంబై..ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ గ్రీన్ను తీసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గ్రీన్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.