లఖ్బీర్‌ సింగ్‌ లండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

 లఖ్బీర్‌ సింగ్‌ లండాను ఉగ్రవాదిగా  ప్రకటించిన కేంద్రం

కెనడాకు చెందిన 33 ఏళ్ల లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది.  2021లో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై జరిగిన రాకెట్ దాడిలో లాండా ప్రమేయం ఉందని, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.  ఇండియా కెనడా మధ్య హర్దీప్ సింగ్ హత్య కేసు వివాదం కొనసాగుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.  

1989లో పంజాబ్'లోని టార్న్ తరణ్ జిల్లాలో జన్మించిన లాండా 2017లో కెనడాకు పారిపోయాడు. ప్రస్తుతం ఇతడు ఖలిస్థానీ గ్రూప్‌ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌ సభ్యుడిగా ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేగాక, ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌, గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూతో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా  పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ హర్వీందర్‌ సింగ్‌ అలియాస్‌ రిండాతోనూ లఖ్బీర్‌ టచ్‌లో ఉన్నట్లు పేర్కొంది.