ఆటో ట్రాలీని ఢీకొట్టిన కారు.. సర్పంచ్ ​భర్తతో పాటు మరొకరు మృతి

ఆటో ట్రాలీని ఢీకొట్టిన కారు.. సర్పంచ్ ​భర్తతో పాటు మరొకరు మృతి
  • ముగ్గురికి గాయాలు
  • నల్గొండ జిల్లా హాలియా శివారులో ఘటన

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా శివారులోని ఆంజనేయ రైస్​మిల్లు సమీపంలో మంగళవారం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో ట్రాలీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కారులోని సర్పంచ్​భర్తతో పాటు మరొకరు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఎస్ఐ శోభన్​బాబు కథనం ప్రకారం..నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం చిట్యాల సర్పంచ్​నాగేంద్రమ్మ భర్త బొమ్మరబోయిన రామారావు(40) నక్క పెంటయ్య(60), మకరబోయి వెంకటేశ్వర్లు, చిన్న దిబ్బయ్య, అంకాల చిన్న ఏడుకొండలు కారులో నాగార్జున సాగర్ నుంచి హాలియా మీదుగా స్వగ్రామానికి బయలుదేరారు.

హాలియా శివారులోని ఆంజనేయ రైస్ మిల్ వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కన ఆపి ఇనుప సామాన్లు లోడ్​చేస్తున్న మినీ ట్రాలీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులోని రామారావు, నక్క పెంటయ్య తీవ్రంగా గాయపడగా 108లో నల్గొండ ఏరియా దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు రామారావు కొడుకు గోపాల కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.