కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మెట్పల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును మేడిపల్లి సమీపంలో కర్నాటక నుంచి కోరుట్ల వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 12 మందికి తీవ్రగాయాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి సీరియస్గా ఉంది.
గాయపడిన వారిని జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్ హాస్పిటళ్లకు తరలించారు. గాయపడిన వారంతా కర్నాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయస్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్నారు. బస్ డ్రైవర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
