ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా.. ఒకరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఫిబ్రవరి 28వ తేదీ బుధవారం ఉదయం సంగారెడ్డి జిల్లా రామేశ్వరం బండ గ్రామ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. మేడ్చల్ నుంచి పటాన్ చెరు వస్తున్న బ్రీజ కారు.. అదుపుతప్పి డివైడర్ మధ్యలో నుంచి దూసుకుపోయి.. పటాన్ చెరు నుంచి మేడ్చల్ వెళ్లే రోడ్డు వైపు పల్టీలు కొడుతూ  బోల్తా పడింది. 

ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైనవారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇటీవల కాలంలో ఔటర్ రింగ్ రోడ్డుపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 23వ తేదీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు కూడా.. పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురై.. ఆమె మృతి చెందిన సంగతి తెలిసిందే. అతి వేగమే రోడ్డు ప్రమాదాలకు కారణంగా పోలీసులు చెబుతున్నా.. మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.