భూవివాదం.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై కేసు

భూవివాదం.. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై కేసు

కొడంగల్​ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డిపై బంజారాహిల్స్​పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. ఇంద్రపాల్​రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  అతడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఫిలింనగర్​ పరిధిలోని ఉప్పరపల్లిలో ఓ స్థలం కొనుగోలు చేసేందుకు సామ ఇంద్రపాల్ ప్రయత్నించారు. ఆయనకు మధ్యవర్తులుగా ఎమ్మెల్యే, రాకేశ్​రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యారు. మరో వ్యక్తితో కలిసి రూ.3.65 కోట్లకు భూమి అమ్ముతామన్నారు. ఇందుకోసం కమీషన్​ ఇవ్వాలని కోరగా ఇంద్రపాల్​ సైతం అంగీకరించారు.  అదే ఏడాది మేలో రూ.90 లక్షలు చెల్లించాడు. అనంతరం విడతల వారీగా మొత్తం రూ.3.05 కోట్లు ముట్టజెప్పాడు. మిగితా రూ.60 లక్షల కోసం లోన్​కి అప్లై చేశానని అది రాగానే చెల్లిస్తానని చెప్పాడు.

మిగతా డబ్బు చెల్లించడం ఆలస్యం అవుతోందని ఎమ్మెల్యే తరఫు అనుచరులు ఇంద్రపాల్​పై బెదిరింపులకు దిగారు. ఓ గదిలో అతన్ని ఉంచి టార్చర్​ చేసినట్లు బాధితుడి ఫిర్యాదులో ఉంది. వారి బారి నుంచి తప్పించుకొని ఇంద్రపాల్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా వివిధ మార్గాల్లో తరచూ తనను బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు. చేసేదేమీ లేక కోర్టును ఆశ్రయించానన్నాడు. కోర్టు ఆదేశాల మేరకే బంజారాహిల్స్ పోలీస్​స్టేషన్​లో పట్నం నరేందర్​రెడ్డి, రాకేశ్​రెడ్డిపై పలు సెక్షన్​లకింద కేసు నమోదయింది. ఈ కేసును ఫిలింనగర్​పోలీస్​స్టేషన్​కి బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.