
న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణలో 2022 నవంబరు నాటికి 17మంది ఎంపీలు, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులున్నాయని అమికస్ క్యూరీ 19 వ రిపోర్ట్ వెల్లడించింది. అందులో అయిదేళ్ల పైబడి పెండింగ్లో ఉన్నవి కేవలం నాలుగు మాత్రమేనని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులలో దోషిగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలను మరో ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు విజయ్ హన్సారియాను అమికస్ క్యూరీగా నియమించింది.
శుక్రవారం ఈ పిటిషన్ మరోసారి బెంచ్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అమికస్ క్యూరీ తన 19 వ రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. 2022 నవంబరు నాటికి తెలంగాణలో 17 మంది ప్రజా ప్రతినిధులపై కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులపై 5,175 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని రిపోర్ట్ వెల్లడించింది. అందులో అయిదేళ్లకు పైగా విచారణలో ఉన్న కేసులు 2,118 అని పేర్కొంది. యూపీలో అత్యధికంగా 1,377 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది.