న్యూఢిల్లీ: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్)ను సుమారు రూ.1,322 కోట్ల మేర మోసగించారన్న ఆరోపణలపై జీ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర సహా మరో ముగ్గురిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తప్పుడు నెట్వర్త్ సర్టిఫికెట్లను సబ్మిట్ చేసి రూ.980 కోట్ల విలువైన రెండు రుణాలను పొంది, ఆపై వాటిని ఎగ్గొట్టారని, ఈ నిధులను దారిమళ్లించారనేది ప్రధాన ఆరోపణ.
ఎఫ్ఐఆర్ ప్రకారం, వసంత్ సాగర్ ప్రాపర్టీస్ సంస్థకు రూ.500 కోట్లు, డిజిటల్ సబ్స్క్రయిబర్ మేనేజ్మెంట్కు రూ.480 కోట్ల రుణాలను చంద్ర వ్యక్తిగత హామీతో ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ మంజూరు చేసింది. ఈ రుణాల కోసం చంద్ర మార్చి 2018లో తన ఆస్తి నికర విలువ రూ.59 వేల కోట్లుగా, జులై 2018లో రూ.40,562 కోట్లుగా పేర్కొంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు.
అయితే, ఆ తర్వాత దివాలా (ఐబీసీ) విచారణల్లో 2017–-18 నాటికి తన నికర విలువ రూ.40 వేల కోట్లకు మించలేదని, 2024 నాటికి అది కేవలం రూ.31.79 కోట్లు మాత్రమేనని చంద్ర స్వయంగా పేర్కొనడంతో మోసం బయటపడింది. తాజాగా చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో రూ.22 వేల కోట్ల క్లెయిమ్లకు గాను కేవలం రూ.6.25 కోట్ల సెటిల్మెంట్కు (99.97శాతం హెయిర్కట్) ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది.
