
- శ్రీశైలానికి వెళ్లొచ్చి నేషనల్ పోలీస్ అకాడమీలో బస
- నేడు ట్రైనీ ఐపీఎస్లకు లెక్చర్.. అనంతరం ఢిల్లీకి పయనం
- కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రవీణ్ పర్యటనకు ప్రాధాన్యం
హైదరాబాద్, వెలుగు: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రవీణ్ సూద్ను.. శంషాబాద్ ఎయిర్పోర్టులో సిటీ జోనల్ సీబీఐ అధికారులు రిసీవ్ చేసుకున్నారు. రోడ్డు మార్గంలో శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)కి తీసుకెళ్లారు.
అనంతరం ఆయన శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. మళ్లీ సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుని ఎన్పీఏలో బస చేశారు. శనివారం ఉదయం ఐపీఎస్ల ట్రైనింగ్కు సంబంధించి ఓ లెక్చర్లో పాల్గొని, తిరిగి ఢిల్లీకి వెళ్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ రాష్ట్రానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లో ఉన్న సీబీఐ అధికారులకు చేరిన ప్రభుత్వ నోటిఫికేషన్పై చర్చించినట్టు తెలిసింది. కాగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతులు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు సమచారం.