విచారణకు హాజరుకాలేను..వాయిదా వేయండి: మనీష్ సిసోడియా

విచారణకు హాజరుకాలేను..వాయిదా వేయండి: మనీష్ సిసోడియా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సీబీఐకి చెప్పారు. తన విచారణను ఫిబ్రవరి చివరి వారం వరకు వాయిదా వేయాలని సీబీఐని కోరుతూ లేఖ రాశారు. ఎందుకంటే తాను ప్రస్తుతం ఢిల్లీ బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నానని, అందుకు తనకు సమయం కావాలని అభ్యర్థించారు. బడ్జెట్‌ను సకాలంలో సమర్పించడం ఆర్థిక మంత్రిగా తన కర్తవ్యమని, ఇది ఢిల్లీకి ముఖ్యమైన సమయమని చెప్పారు. దీని కోసం తాను 24 గంటలు పని చేస్తున్నాన్న మనీశ్ సిసోడియా.. తానేమీ పారిపోవాలని గడువు అడగడం లేదని స్పష్టం చేశారు. బడ్జెట్ పై ఫోకస్ చేసేందుకే ఈ సమయం అడిగానని తెలిపారు.

విచారణకు తాను ఎప్పుడూ సహకరిస్తానని.. ఇప్పుడు మాత్రం ఈ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరినట్టు సిసోడియా  చెప్పారు. అంతకుముందు లిక్కర్ స్కాంలో సిసోడియా పేరున్నట్టు సీబీఐ వెల్లడించింది. విచారణకు హాజరు కావాలంటూ మరోసారి పిలుపొచ్చిందని ఆయన ఇటీవల ట్వీట్ ద్వారా తెలియజేశారు. గతంలో ఆ సంస్థలు తన ఇల్లు, బ్యాంకు లాకర్‌ను తనిఖీ చేసినా తనకు వ్యతిరేకంగా వారికి ఏమీ దొరకలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే నేడు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ సూచించగా.. సిసోడియా మాత్రం వాయిదా వేయమని కోరారు. ఇక సిసోడియా విజ్ఞప్తిపై సీబీఐ నుంచి సమాధానం రావాల్సి ఉంది.